Nagole Eco Ganesha
హైదరాబాద్లో వినాయక చవితి అనగానే అందరికీ ఖైరతాబాద్ బడా గణపయ్యే గుర్తుకు వస్తాడు. కానీ ఈసారి భాగ్యనగరంలో క్రీడా ప్రాంగణాలకు, ఈస్ట్ జోన్కు నిలయమైన నాగోల్ ఏరియా ఒక కొత్త రికార్డ్తో చరిత్ర సృష్టించింది. 69 అడుగుల ఖైరతాబాద్ విగ్రహం కంటే ఎక్కువ ఎత్తుతో తెలంగాణలోనే అతిపెద్ద మట్టి గణపతి విగ్రహం నాగోల్లో రూపుదిద్దుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పర్యావరణ పరిరక్షణే టార్గెట్గా రూపొందిన ఈ 72 అడుగుల భారీ విగ్రహాన్ని తిరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ లంబోదరుడి మహా రూపానికి అష్టసిద్ధి మహాగణపతిగా నామకరణం చేశారు. 8 ఏళ్లుగా ఇక్కడ పూర్తిగా మట్టి గణపతులనే ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు.
ప్రతీ ఏడాది 9 సంఖ్య ఆధారంగా లెక్కలు వేస్తూ మెల్లగా విగ్రహం ఎత్తును పెంచుకుంటూ వస్తున్నారు. ప్రఖ్యాత శిల్పి కొత్తకొండ నగేశ్ పర్యవేక్షణలో ఈ భారీ వినాయక రూపం జీవం పోసుకుంది.
ఈ 72 అడుగుల గణేషుడి భారీ విగ్రహ తయారీలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లాంటి ప్రమాదకర రసాయనాలను వాడలేదు. కలకత్తా నుంచి తెప్పించిన బంకమట్టి, గంగమట్టి,గడ్డి,జనుము, వరిపొట్టు, కర్రలు, సుతిలి తాళ్లను మాత్రమే ఉపయోగించారు.
నేచురల్ వాటర్ కలర్లతో కాంతివంతంగా తీర్చిదిద్దిన ఈ విఘ్నేశ్వరుడిని చూడటానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. నవరాత్రులు పూర్తయిన తర్వాత పర్యావరణానికి ఏమాత్రం ముప్పు లేకుండా, ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ నెల 26వ తేదీన మండపం వద్దే ఈ భారీ మట్టి గణనాధుడికి నిమజ్జనం జరుపుతామని నిర్వాహకులు చెబుతున్నారు.
Leaftronics : ఈ-వేస్ట్ సమస్యకు శాశ్వత చెక్ ..చెట్టు ఆకుల్లో దాగున్న ఎలక్ట్రానిక్ సీక్రెట్ ఏంటి?
