AP government: కూటమి ప్రభుత్వం తీపి కబురు..ఉగాది టార్గెట్గా వారికి గృహప్రవేశాలు
AP government: గృహనిర్మాణ పథకాల కింద సామాజిక వర్గాలకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మరింత పెంచాలని ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.
AP government
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం(AP government), పేద వర్గాల ప్రజలకు గృహనిర్మాణ రంగంలో శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్ల నిర్మాణం, గృహనిర్మాణ శాఖ పురోగతిపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు .అలాగే వేగంగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP government), పూర్తయిన ఇళ్ల విషయంలో ఒక స్పష్టమైన కాలపరిమితిని నిర్దేశించారు. రాష్ట్రంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఇళ్లకు ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు.
ఈ ప్రక్రియ ద్వారా వచ్చే ఉగాది పండుగ నాటికి మొత్తం ఐదు లక్షల మందికి ఇంటి తాళాలు అందించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మొత్తం 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే మూడు లక్షలకుపైగా ఇళ్లు పూర్తి చేసి, సామూహిక గృహప్రవేశాలు నిర్వహించినట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేసేలా అధికారులు వేగంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
గృహనిర్మాణ పథకాల కింద సామాజిక వర్గాలకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మరింత పెంచాలని ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY-1.0) పథకం కింద నిర్మాణం చేపట్టే ఇళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీ (PVTGs) వర్గాలకు ఇప్పటికే అదనపు ఆర్థిక సహాయం అందుతోంది.
తాజాగా, ముస్లింలకు కూడా రూ.50,000 అదనంగా ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
ఈ నిర్ణయం ద్వారా సుమారు 18 వేల మంది ముస్లిం లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని, దీనికి గాను రూ. 90 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఈ అదనపు సాయాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత మరియు వేగం ఉండేలా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
అర్హుల ఎంపికకు సంబంధించిన సర్వేను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని, అర్హుల జాబితాను పారదర్శకత కోసం గ్రామాల్లో ప్రదర్శించాలని సూచించారు.
ఇంటి నిర్మాణం కోసం ఎవరికైనా స్థలం లేకపోయినా, వారికి స్థలం కేటాయించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరికైనా స్థలాలు ఉండి, అందులో ఇల్లు నిర్మించుకుంటామని చెబితే, వారికి వెంటనే పొసెషన్ సర్టిఫికెట్లు అందించాలని స్పష్టం చేశారు.
ఇళ్ల నిర్మాణాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ ఆన్లైన్లో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
గతంలో నిలిచిపోయిన ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం బిల్లులను కూడా విడుదల చేయించేలా కృషి చేయాలని, ఈ బిల్లులు ఎందుకు నిలిచిపోయాయో లబ్ధిదారులకు స్పష్టంగా వివరించాలని అధికారులకు సూచించారు.



