Just TelanganaJust PoliticalLatest News

Revanth Reddy: నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి.. వాడి తగ్గని శపథాల రాజకీయం

Revanth Reddy: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని 80 నుంచి 100 సీట్లతో మళ్లీ గెలిపించి చూపిస్తానని, కేసీఆర్ కుటుంబ చరిత్రను శాశ్వతంగా ముగిస్తానని రేవంత్ సవాల్ విసిరారు.

Revanth Reddy

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వేదికగా చాలా ఘాటుగా బదులిచ్చారు. “నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. కాలకూట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం” అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

కేవలం తిట్టి ఊరుకోకుండా, 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని 80 నుంచి 100 సీట్లతో మళ్లీ గెలిపించి చూపిస్తానని, కేసీఆర్ కుటుంబ చరిత్రను శాశ్వతంగా ముగిస్తానని ఆయన సవాల్ విసిరారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుల పేర్లను ప్రస్తావిస్తూ, చేతనైతే తన రాజకీయాన్ని అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) వేసిన సవాల్ ఇప్పుడు రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది.

అయితే రాజకీయాల్లో ఇలాంటి శపథాలు కొత్తేమీ కాదు. గతంలోకి వెళ్లి చూస్తే, తెలుగు గడ్డపై ఇలాంటి భీకర శపథాలు చేసిన నాయకులు తమ మాటను నెరవేర్చుకుని చరిత్ర సృష్టించారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ కాంగ్రెస్ అహంకారాన్ని మట్టి కరిపిస్తానని శపథం చేసి, పట్టుమని పది నెలలు కూడా తిరగకముందే ఆ పార్టీని గద్దె దించి ముఖ్యమంత్రి అయ్యారు.

అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో ఉచిత విద్యుత్ ఫైలుపైనే మొదటి సంతకం చేస్తానని మాటిచ్చి, అన్నంత పనిచేసి చూపించారు.

Revanth Reddy
Revanth Reddy

ఇక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కూడా నాడు తన తల నరికినా సరే వెనక్కి తగ్గనని, తెలంగాణ తెచ్చి తీరుతానని శపథం చేశారు. ఆ శపథమే ఆయనను రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఈ చరిత్రను గమనిస్తే, ఒక నాయకుడు కసితో చేసే శపథం ఆ రాష్ట్ర రాజకీయ దిశనే మార్చేస్తుందని మనకు అర్థమవుతుంది.

ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయి కసితో కేసీఆర్ ఫ్యామిలీపై విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు కేసీఆర్ హయాంలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం, ఆ తర్వాత రాజకీయంగా ఎన్నో అవమానాలు పడటం ఆయన మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే ఇప్పుడు అధికారం చేతిలో ఉండటంతో, కేసీఆర్ ఓటు బ్యాంకును దెబ్బకొట్టి, బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేయాలని ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యారు.

కానీ కేసీఆర్ లాంటి అపర చాణక్యుడిని, కేటీఆర్, హరీష్ రావు వంటి వ్యూహకర్తలను తట్టుకుని రేవంత్ రెడ్డి తన శపథాన్ని ఎలా నెరవేర్చుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, మరోవైపు కేసీఆర్ కు ఉన్న సెంటిమెంట్ ఓటు.. ఈ రెండింటి మధ్య 2029లో జరిగే పోరాటం తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను తుఫానును సృష్టించబోతోంది.

అయితే రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నట్లుగా కేసీఆర్ కుటుంబాన్ని పూర్తిగా అధికారానికి దూరం చేయడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ కు తెలంగాణలో ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిగా ఆయనపై ప్రజల్లో ఇంకా గౌరవం ఉంది. అలాగే కేటీఆర్, హరీష్ రావు వంటి యువ నాయకులు పార్టీని మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన పథకాలతో ప్రజల మనసు గెలుచుకుంటే ఆయన శపథం నెరవేరొచ్చు. కానీ అదే సమయంలో ప్రతిపక్షం బలంగా పుంజుకుంటే సమీకరణాలు మారిపోనూవచ్చు. మొత్తం మీద చూస్తే, రేవంత్ రెడ్డి చేసిన ఈ శపథం రాబోయే ఐదేళ్ల పాటు తెలంగాణ రాజకీయాలను రణరంగంలా మార్చబోతోందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రజల నాడి ఎటు మళ్లుతుందో ఊహించడం కష్టం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

One Comment

Back to top button