Pay Commission: పెన్షనర్లకు ఊరట.. 8వ వేతన సంఘం సవరణలపై నెలకొన్న గందరగోళానికి తెర పడినట్లే
Pay Commission: 2025 డిసెంబర్ 31 లేదా, అంతకంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి ఇప్పుడు కొత్త పెన్షన్ సవరణ ప్రయోజనాలు అందుతాయా? లేదా అన్న వారు పాత పద్ధతిలోనే పెన్షన్ తీసుకోవాలా? అనే ప్రశ్న చాలామంది పెన్షనర్ల మనసులో వేధిస్తుంది.
Pay Commission
దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఊరట లభించింది. 2025 నవంబర్ నెలలో 8వ వేతన సంఘం(Pay Commission) ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి, ఆ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయనే విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31 లేదా, అంతకంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి ఇప్పుడు కొత్త పెన్షన్ సవరణ ప్రయోజనాలు అందుతాయా? లేదా అన్న వారు పాత పద్ధతిలోనే పెన్షన్ తీసుకోవాలా? అనే ప్రశ్న చాలామంది పెన్షనర్ల మనసులో వేధిస్తుంది.
దీంతో పదవీ విరమణకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులతో పాటు, ఇప్పటికే పెన్షన్ పొందుతున్న పెన్షనర్లు కూడా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. తాజాగా పార్లమెంటులో ఇచ్చిన వివరణతో వీరి అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.
ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి..తాజాగా లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, 8వ వేతన సంఘం(Pay Commission) కేవలం ప్రస్తుత ఉద్యోగుల జీతభత్యాల కోసమే కాదని, పెన్షనర్ల ప్రయోజనాలను కూడా ఇది పరిరక్షిస్తుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 2025 లోపు రిటైర్మెంట్ తీసుకున్న వారు కూడా 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పెన్షన్ పెంపును పొందుతారని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
సాధారణంగా వేతన సంఘం ప్రతి పదేళ్లకు ఓసారి వస్తుంది. ఈ సమయంలో కేవలం జీతాలే కాకుండా, పెన్షన్ల గణనలోనూ భారీ మార్పులు జరుగుతాయి. అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరగడంతో పెన్షన్ మొత్తంలో గణనీయమైన మార్పు వస్తుంది. అంటే పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా, కొత్త స్కేల్ అమల్లోకి వచ్చినప్పుడు అందరికీ సమానంగానే లబ్ధి చేకూరుతుంది.

ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. పెన్షన్ల సవరణ ప్రక్రియ అనేది.. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు 2021 ప్రకారం జరుగుతుంది. వేతన సంఘం తన రిపోర్టులో పెన్షన్ల పెంపు గురించి కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది. ఆ ప్రతిపాదనలను మోదీ ప్రభుత్వం పరిశీలించి, ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అమలులోకి తీసుకువస్తుంది.
దీని వల్ల పాత పెన్షనర్లతో పాటు కొత్తగా పదవీ విరమణ చేసే వారి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదు. భవిష్యత్తులో పెరగబోయే కనీస అవసరాల ధరలను, జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ పెన్షన్ల సవరణ చేపడతామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఆర్థిక భరోసా లభించడమే కాకుండా, పెన్షన్ల వ్యత్యాసంపై ఉన్న అపోహలు కూడా తొలిగిపోయినట్లు అయింది. 2025 ముగియకముందే రిటైర్ అయ్యే వారంతా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేలిపోయింది.




isemuq