Rajasthan Royals : రవి బిష్ణోయ్ మ్యాజిక్…ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
Rajasthan Royals : ఐపీఎల్ 19వ సీజన్ కు ఊపొచ్చింది. ఛేజింగ్ జట్ల విజయాలతో ఇంకా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ దొరకని వేళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులను ఉత్కంఠతో ఊపేసింది
Rajasthan Royals
ఐపీఎల్ 19వ సీజన్ కు ఊపొచ్చింది. ఛేజింగ్ జట్ల విజయాలతో ఇంకా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ దొరకని వేళ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులను ఉత్కంఠతో ఊపేసింది. చివరి బంతి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ అద్భుత పోరాటంతో గెలుపును సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్(Rajasthan Royals) బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 6.1 ఓవర్లలోనే 70 పరుగులు జోడించారు. మరో హాఫ్ సెంచరీ చేస్తాడనుకున్న వైభవ్ 18 బంతుల్లో 31 (5 ఫోర్లు,1 సిక్సర్ ) పరుగులకు ఔటయ్యాడు. మరోవైపు జైస్వాల్ కూడా దుమ్మురేపాడు.
36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. జురెల్ తో కలిసి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక్కడ నుంచీ రియాన్ పరాగ్ (8), హెట్ మెయిర్ (18), ఫెరీరా (1) వెంటవెంటనే ఔటయ్యారు. అయితే మరో ఎండ్ లో ధృవ్ జురెల్ మాత్రం దూకుడుగా ఆడాడు. జురెల్ ఇన్నింగ్స్ తోనే రాజస్థాన్ రాయల్స్ స్కోరు 200 దాటగలిగింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడి స్కోర్ పెంచాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రబాడ 2 , సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణ , అశోక్ శర్మ, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు. భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ కూడా ధాటిగానే ఆడింది. ఓపెనర్లు కుమార కుషాగ్ర, సాయి సుదర్శన్ తొలి ఓవర్ నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ 8 ఓవర్లలో 78 పరుగులు జోడించారు.

కుషాగ్ర 18 పరుగులకు ఔటవగా.. బట్లర్, సాయి సుదర్శన్ కాసేపు నిలకడగా ఆడారు. అయితే స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. వరుస ఓవర్లలో బిష్ణోయ్ తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు. సాయి సుదర్శన్ 73 ( 9 ఫోర్లు,3 సిక్సర్లు) , గ్లెన్ ఫిలిప్స్ (3), వాషింగ్టన్ సుందర్ (4), తెవాటియాలను ఔట్ చేశాడు. ఫలితంగా గుజరాత్ కథ ముగుస్తుందనిపించింది. ఇక్కడ నుంచి రషీద్ ఖాన్, రబాడ పోరాటం మాత్రం ఆకట్టుకుంది.
వీరిద్దరూ ఏడో వికెట్ కు 43 పరుగులు జోడించారు. ఇక్కడ ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అనిపించింది. అయితే 19వ ఓవర్ ను ఆర్చర్, 20 ఓవర్ ను తుషార్ దేశ్ పాండే అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ 204 పరుగులకే పరిమితమైంది. రవి బిష్ణోయ్ 4 వికెట్లతో గుజరాత్ ను దెబ్బకొట్టాడు.





