Lord Venkanna:రూ. 300 టికెట్లు దొరకలేదా? శ్రీవారి దర్శనానికి మరో ఈజీ మార్గం..
Lord Venkanna: శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం పూర్తయిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భక్తులను 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.
Lord Venkanna
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసే భక్తులకు టీటీడీ ఒక అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా ప్రతీ నెలా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలయిన నిమిషాల వ్యవధిలోనే అయిపోతుంటాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు టికెట్లు దొరక్క నిరాశకు లోనవుతుంటారు.
అలాంటి వారి కోసమే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఒక వరంగా మారుతోంది. ఈ హోమం టికెట్ పొందిన శ్రీవారి భక్తులకు హోమంతో పాటు అదే రోజు వెంకన్న(Lord Venkanna) ప్రత్యేక దర్శన భాగ్యం కూడా కలుగుతుంది.
ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి సంబంధించిన మే నెల కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్ 25వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయబోతోంది. అలిపిరి పాదాల చెంత ఉన్న సప్త గోప్రదక్షిణశాలలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కాగా ఈ టికెట్ ధర 1600 రూపాయలుగా టీటీడీ అధికారులు నిర్ణయించారు.
ఒక్క టికెట్పై దంపతులు కానీ ఇద్దరు వ్యక్తులు కానీ హోమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం పూర్తయిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భక్తులను 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. అంటే దర్శనం టికెట్లు దొరకని వారు.. ఈ హోమంలో పాల్గొనడం ద్వారా స్వామివారిని ఈజీగా దర్శించుకోవచ్చన్న మాట.
టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హోమం ప్రతిరోజూ జరుగుతుంది కాబట్టి భక్తులు తమకు అనుకూలమైన తారీఖును ముందుగానే ఎంచుకోవచ్చు.
అయితే చాలా మంది భక్తులకు ఈ సదుపాయం గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ల గురించి తెలుసుకోలేకపోతున్నారు. అందుకే టీటీడీ ఈ విషయాన్ని వెంకన్న భక్తులకు వివరిస్తూ.. దర్శనానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచిస్తోంది. ముఖ్యంగా వారాంతాల్లో , సెలవు రోజుల్లో తిరుమల శ్రీవారి (Lord Venkanna)దర్శనానికి వచ్చే భక్తులకు ఇది ఒక మంచి అవకాశం అని అధికారులు వివరిస్తున్నారు.

మరోవైపు తిరుమలలో రేపటి నుంచి అంటే ఏప్రిల్ 25వ తేదీ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. దీని కోసం నారాయణగిరి ఉద్యానవనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు టీటీడీ అధికారులు.
ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు.. మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామి గజవాహనంపైన, రెండో రోజు అశ్వవాహనంపైన, మూడో రోజు గరుడవాహనంపైన వేంచేసి భక్తులకు దర్శనమివ్వనున్నారు. తర్వాత రంగస్థల మండపంలో కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకలను కనులారా వీక్షించడానికి వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను, సౌకర్యాలను కల్పించింది.
Ram Charan: రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ లాక్.. బాక్సాఫీస్ వద్ద మెగా వేట మొదలయ్యేది అప్పుడేనా?





