Temple :గుడిలో గర్భగుడి వెనుక భాగాన్ని ముట్టుకోకూడదా? ఆలయ ఆవరణలో కాసేపైనా కూర్చోవాలా?
Temple :దేవాలయానికి వెళ్లినప్పుడు చాలా మంది గర్భగుడి వెనుక భాగాన్ని చేతులతో తాకడం కానీ అక్కడ నుదురు పెట్టి దండం పెట్టుకోవడం కానీ చేస్తుంటారు.
Temple
మన హిందూ సాంప్రదాయంలో గుడులకు వెళ్లినప్పుడు పూజలు చేయడం మాత్రమే కాదు.. అక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏ ఏ పనులు చేయకూడదనే విషయాలపై ప్రత్యేకమైన నియమాలు కూడా కొన్ని ఉన్నాయి. పెద్దవాళ్లు దేవాలయానికి వెళ్లినప్పుడు అది ముట్టుకోవద్దు.. ఇలా నడవద్దని చెబుతుంటారు.
అయితే పెద్దలు చెప్పే ఈ మాటలన్నింటి వెనుక కేవలం మూఢనమ్మకాలు మాత్రమే లేవు. అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు, సైన్స్ కూడా దాగి ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
మొదటిగా దేవాలయానికి వెళ్లినప్పుడు చాలా మంది గర్భగుడి వెనుక భాగాన్ని చేతులతో తాకడం కానీ అక్కడ నుదురు పెట్టి దండం పెట్టుకోవడం కానీ చేస్తుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం అయితే గుడి వెనుక భాగాన్ని అస్సలు ముట్టుకోకూడదట. ఎందుకంటే గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు విగ్రహం కింద ఎన్నో శక్తివంతమైన యంత్రాలను ఉంచుతారు.
మూలవిరాట్ ముఖభాగం నుంచి వెలువడే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా గుడి వెనుక వైపు నుంచే ప్రసరిస్తుంది. అలాంటి శక్తివంతమైన కిరణాలు వెలువడే ప్రదేశాన్ని మనం తాకడం వల్ల ఆ ఎనర్జీ సర్క్యూట్కు అడ్డంకిగా మారుతుంది. అందుకే ఆ భాగాన్ని తాకకుండా దూరం నుంచే నమస్కరించుకోవాలి.
అలాగే ఆలయ ధ్వజస్తంభం దగ్గర ఉండే బలిపీఠాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో చేతులతో తాకకూడదట. బలిపీఠం అంటే జీవులలోని కామ, క్రోధ, లోభ, మదము , మత్సరం ,మోహాలనే అరిషడ్వర్గాలను అంటే చెడు గుణాలను దేవుడికి బలి ఇచ్చే చోటు. ఆలయంలోకి వెళ్లేటప్పుడు మన మనసులోని అహంకారంతో పాటు చెడు ఆలోచనలను కూడా ఆ బలిపీఠం దగ్గరే వదిలేసి లోపలికి వెళ్లాలని పండితులు చెబుతారు.
ఆలయం (Temple)లోనికి వెళ్లిన భక్తులంతా అక్కడ వదిలేసిన ఆ నెగెటివ్ ఎనర్జీ ఆ బలిపీఠం వద్దే కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి దానిని ముట్టుకుంటే ఆ ప్రతికూల శక్తి అంతా మనకు సోకుతుందని పెద్దలు చెబుతారు.
ఇక దేవాలయం(Temple) చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించాలి. గర్భగుడి గోడలకు మరీ దగ్గరగా నడవకూడదు. కనీసం ఒక గజం అంటే 3 అడుగుల దూరంలో ప్రదక్షిణలు చేయాలి. దీని వెనుకున్న కారణం ఏంటంటే.. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రహరీలో ఆ భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల, మంత్రోచ్ఛారణల వల్ల ఒక బలమైన విద్యుదయస్కాంత వలయం (Aura) ఏర్పడుతుంది.

మనం గుడి గోడలకు మరీ దగ్గరగా నడిస్తే ఆ ఎనర్జీ ఒత్తిడిని మనిషి శరీరం తట్టుకోలేదు. అదే ఒక గజం దూరం నుంచి ప్రదక్షిణ చేస్తే ఆ క్షేత్రం నుంచి వచ్చే సానుకూల శక్తి శరీరానికి, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.
అలాగే భగవంతుని దర్శించుకున్న తర్వాత వెంటనే గుడి బయటకు వచ్చేయకుండా.. ధ్వజస్తంభం వద్ద కానీ ఆలయ ప్రాంగణంలో కానీ కనీసం ఐదు నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చోవాలట. ఎందుకంటే గుడిలో మనం పొందిన ఆ దైవిక శక్తి మనిషి శరీరంలో పూర్తిగా లీనమవ్వడానికి ఈ పద్ధతి దోహదపడుతుందని పండితులు చెబుతారు. ఇలా చిన్న చిన్న నియమాలను పాటిస్తూ దైవదర్శనం చేసుకుంటే మానసిక ప్రశాంతతే కాదు సంపూర్ణ ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది.
Gold Prices : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం ధరలు





