Bhogapuram Airport : భోగాపురం జర్నీ ఇక నాన్స్టాప్.. 7 కనెక్టింగ్ రోడ్లు, స్పెషల్ ఈ-బస్సులు
Bhogapuram Airport : గాజువాక నుంచి భోగాపురం వరకు ప్రతీరోజు కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
Bhogapuram Airport
విశాఖపట్ణంలోని ప్రధాన ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్(Bhogapuram Airport)కు చేరుకోవడం ఎలా అనే ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో తెరదించింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వెళ్లే ప్రయాణికులకు.. జర్నీ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా , ఎలాంటి చికాకులు లేకుండా సాగిపోనుంది.
ఒకవైపు విశాఖ మహానగరాన్ని ఎయిర్పోర్ట్తో కనెక్టివిటీ చేయడానికి అత్యాధునిక రోడ్ నెట్వర్క్ను సిద్ధం చేస్తూనే, మరోవైపు ప్రయాణికుల కోసం మునుపెన్నడూ లేని విధంగా గ్రీన్ ట్రాన్స్పోర్ట్, ప్రీమియం వెయిటింగ్ లాంజ్ ఫెసిలిటీలను అందుబాటులోకి తెస్తోంది. విశాఖ రూపురేఖలను మార్చేలా చేపట్టిన ఈ కనెక్షన్ ప్రాసెస్ ఇప్పుడు నగరవాసులతో పాటు పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచబోతోంది.
విజయనగరం జిల్లా పరిధిలోని భోగాపురం ఎయిర్పోర్ట్కు ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ప్రయాణికులు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.172 కోట్ల భారీ బడ్జెట్తో విస్తృతమైన మౌలిక సదుపాయాల పనులకు శ్రీకారం చుట్టింది. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ , ఆర్అండ్బి శాఖలు కంబైన్డ్గా విశాఖ సిటీతో పాటు పరిసర ప్రాంతాలలో ఏడు కీలకమైన కనెక్టింగ్ రోడ్లను అత్యంత వేగంగా తీర్చిదిద్దడానికి రెడీ అవుతున్నాయి.
ఈ రహదారులను 80 నుంచి 100 అడుగుల వెడల్పుతో నాలుగు నుంచి ఆరు వరుసల రహదారులుగా విస్తరిస్తుండగా, ఇప్పటికే 5 ప్రధాన రోడ్ల పనులు ఫైనల్ స్టేజ్కు చేరుకున్నాయి. ఈ రోడ్లన్నీ డైరెక్టుగా అనకాపల్లి-ఆనందపురం ఎన్హెచ్-16 బైపాస్తో పాటు సుందరమైన బీచ్ రోడ్డు కారిడార్ను కనెక్ట్ చేయబడుతున్నాయి.
కొత్తగా వచ్చే ప్రయాణికులు లేదా నైట్ టైమ్లో వెళ్లేవారు దారి తప్పి గందరగోళానికి గురి కాకుండా ఉండటానికి ఏకంగా 150 నావిగేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఇంటర్నేషనల్ స్థాయిలో పేరున్న గోవా ఎయిర్పోర్ట్కు పనిచేసిన అనుభవజ్ఞులైన టెక్నికల్ కంపెనీ భాగస్వామ్యాన్ని తీసుకున్నారు.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా మూడు భాషల్లో స్పష్టమైన వివరాలతో ఈ బోర్డులు దర్శనమిస్తాయి. వీఎమ్ఆర్డీఏ పరిధిలోని 40 కి.మీటర్ల పరిధిలో 32 ప్రదేశాల్లో, జీవీఎమ్సీ పరిధిలోని 60 కిలోమీటర్లలో 34 కీలక ప్రాంతాల్లో వీటిని అమర్చుతున్నారు.
రోడ్ల విస్తరణతో పాటు జర్నీ సాఫీగా సాగేలా ప్రధాన కూడళ్ల వద్ద స్పెషల్ డెవలప్మెంట్ పనులను చేపట్టారు. మారికవలస జంక్షన్ వద్ద ఉన్న పాత సిగ్నల్ పాయింట్ను ముందుకు పంపించి, భోగాపురం వైపు వెళ్లే వెహకల్ కోసం కొత్తగా సర్వీసు రోడ్డును అందుబాటులోకి తెచ్చారు. అడవివరం నుంచి శొంఠ్యాం రోడ్డు ఎన్హెచ్ కలిసే ప్లేస్లో సెంట్రల్ డివైడర్లు, జీబ్రా క్రాసింగ్లు , కొత్త సిగ్నళ్లను అమర్చుతున్నారు.
అదేవిధంగా బోయపాలెం-కాపులుప్పాడ జంక్షన్లో కూడా సెంట్రల్ డివైడర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చడంతో పాటు ఎయిర్పోర్టుకు కనెక్టయ్యే అన్ని మార్గాలను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తున్నట్లు వీఎమ్ఆర్డీఏ కమిషనర్ తేజ్భరత్ వెల్లడించారు.
మరోవైపు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ను దృష్టిలో ఉంచుకుని ఎయిర్పోర్ట్ ప్రయాణికుల కోసం స్పెషల్గా పర్యావరణ హిత ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను రోడ్డెక్కిస్తున్నారు. పీఎం ఈ-బస్ సేవా పథకంలో భాగంగా కేటాయించిన 20 అత్యాధునిక బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తాజాగా ప్రారంభించారు.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీటర్ల దూరం ప్రయాణించే ఈ బస్సుల్లో లగేజీకి ప్రత్యేక స్థలం, సుఖవంతమైన ఎయిర్ సస్పెన్షన్, ఆటోమేటిక్ డోర్లు, దివ్యాంగుల కోసం వీల్చైర్ లిఫ్ట్ వంటి హైటెక్ వసతులున్నాయి. గాజువాక నుంచి భోగాపురం వరకు ప్రతీరోజు కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే ఈ బస్సుల సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్కి లేని విధంగా జీఎంఆర్ సంస్థ విశాఖపట్నం సిటీలో ప్రయాణికుల కోసం 9 ప్రత్యేక బిజినెస్ వెయిటింగ్ లాంజ్లను నిర్మిస్తోంది.
40 అడుగుల వెడల్పు కలిగిన ప్రత్యేక కంటైనర్ల రూపంలో రూపుదిద్దుకునే ఈ లాంజ్లను తొలి విడతగా ఎన్ఏడీ జంక్షన్, వుడా పార్క్, గురుద్వారా, ఆటోనగర్ , వెంకోజీపాలెం ప్రాంతాల్లో అందుబాటులోకి తేబోతున్నారు.
విమాన ప్రయాణికులు సిటీలోనే ప్రశాంతంగా వేచి ఉండి, అక్కడ నుంచి డైరెక్టుగా ఎలక్ట్రికల్ బస్సుల్లో భోగాపురం చేరుకోవడానికి ఈ ఇన్నేవేటివ్ సిస్టంను తీర్చిదిద్దుతున్నారు.





