Urine : నీళ్లు ఎక్కువ తాగుతున్నా మూత్రం తక్కువ వస్తుందా? అర్జంటుగా కారణం తెలుసుకోండి..
Urine : మూత్రం ముదురు రంగులోకి మారడం, నోరు ఎండిపోవడం, విపరీతమైన దాహం , ఎప్పుడూ అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Urine
ఆరోగ్యంగా ఉండే వ్యక్తి సాధారణంగా రోజుకు కనీసం ఒకటి నుంచి రెండు లీటర్ల మూత్రాన్ని విసర్జించాలని వైద్యులు అంటారు. ఇది శరీరం నుంచి వ్యర్థాలను, విషపదార్థాలను బయటకు పంపించే ఒక సహజమైన ప్రక్రియ.
అయితే, రోజంతా సరిపడా నీళ్లు తాగినా కూడా చాలా తక్కువగా అంటే సుమారుగా 400 మిల్లీలీటర్ల కంటే తక్కువ మూత్రం(Urine )వస్తుంటే దానిని ఒలిగూరియా (Oliguria) అని పిలుస్తారు.
ఎండ తీవ్రత వల్ల లేదా ఎక్కువగా చెమట పట్టడం వల్ల టెంపరరీగా మూత్రం తగ్గడం కామనే కానీ, తగినంత నీరు తీసుకున్నా కూడా ఈ సమస్య చాలా రోజులు కొనసాగితే మాత్రం అది కిడ్నీ కానీ మూత్రనాళ లోపాలకు కానీ సంకేతం కావొచ్చు.
ఈ సమస్య ఉన్నప్పుడు యూరిన్(Urine) చాలా తక్కువ పరిమాణంలో వస్తుంది. దీంతో పాటు మూత్రం ముదురు రంగులోకి మారడం, నోరు ఎండిపోవడం, విపరీతమైన దాహం , ఎప్పుడూ అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమస్య కొంచెం పెద్దదైతే కాళ్లు, చేతులు, ముఖంలో వాపు రావడం, వికారం, తలతిరగడం, కడుపులో అసౌకర్యంగా ఉండటం వంటివి జరుగుతాయి.
అయితే ఈ పరిస్థితి మరింత ముదిరినపుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, మానసిక గందరగోళం ఏర్పడటం లేదా అసలు మూత్రమే రాకపోవడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా తలెత్తుతాయి.
శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం అంటే డీహైడ్రేషన్ దీనికి మొదటి కారణంగా చెప్పొచ్చు. జ్వరం, వాంతులు, విరేచనాలు అయినప్పుడు కానీ అసలు నీళ్లే తాగనప్పుడు కానీ శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది.
రెండవది కిడ్నీ సమస్యలున్నా కూడా యూరిన్ పరిమాణం తగ్గుతుంది. కిడ్నీలు దెబ్బతినడం, కిడ్నీలో రాళ్లు ఉండటం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI) , దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల వల్ల మూత్ర ఉత్పత్తి తగ్గిపోతుంది.
అడ్డంకులు ఏర్పడటం మూడో కారణం. ముఖ్యంగా ఇది పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది.వీరిలో వయసు పైబడటం వల్ల ప్రొస్టేట్ గ్రంథి వాపునకు గురై మూత్ర(Urine) ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. వీటితో పాటు డాక్టర్ల సలహా లేకుండానే విపరీతంగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కూడా కిడ్నీల పనితీరు దెబ్బతిని ఈ సమస్య వస్తుంది.

ఈ సమస్య ఒకవేళ కేవలం డీహైడ్రేషన్ వల్లే వస్తే మాత్రం తగినంత నీరు, ఓఆర్ఎస్ ద్రవాలు తీసుకుంటే సరిపోతుంది. ఇన్ఫెక్షన్లు ఉంటే మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఒకవేళ కిడ్నీలో స్టోన్స్ లేదా ప్రొస్టేట్ సమస్యల వల్ల అడ్డంకులు ఏర్పడితే మాత్రం చిన్నపాటి సర్జరీ అవసరం కావొచ్చు.
అయితే, తక్కువ మూత్రంతో పాటు పొత్తికడుపులో , నడుము భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో పాటు శరీరం వాచిపోవడం, జ్వరం, లేదా మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలి.
ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారిలో కిడ్నీలు త్వరగా దెబ్బతినే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది . కాబట్టి వారు ఎప్పుడూ బీపీ, షుగర్ను అదుపులో ఉంచుకునేలా జాగ్రత్తపడాలి.





