Nirav Modi : నీరవ్ మోదీ ఆటకట్టు..త్వరలో భారత్‌కు అప్పగింత

Nirav Modi : భారత్‌కు రాకుండా తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న నీరవ్ మోదీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా అతని చివరి ప్రయత్నం కూడా బెడిసికొట్టింది.

Nirav Modi

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త నీరవ్ మోదీ(Nirav Modi )ఆట ముగిసినట్టే. వీలైనంత త్వరలో భారత్‌కు అతన్ని అప్పగించేందుకు లైన్ క్లియరైంది. భారత్‌కు రాకుండా తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న నీరవ్ మోదీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

తాజాగా అతని చివరి ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో సైతం నీరవ్‌కు చుక్కెదురైంది. తనను భారత్‌కు అప్పగించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన చివరి లీగల్ పిటిషన్‌ను యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తిరస్కరించింది. దీంతో నీరవ్ మోదీని తిరిగి భారత్‌కు తీసుకురావడానికి అన్ని చట్టపరమైన అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోయినట్టయింది.

వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ మోదీ(Nirav Modi) పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13,000 కోట్లకు పైగా మోసం చేశారనే తీవ్ర ఆర్థిక నేరాల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సీబీఐ, ఈడీ ఈ కేసులో దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముంబైలోని పీఎన్‌బీ బ్రాడీ హౌస్ శాఖకు చెందిన కొందరు బ్యాంకు అధికారులతో నీరవ్ మోదీ కుమ్మక్కయ్యారు.ఎటువంటి గ్యారంటీ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ పొంది, వాటి ఆధారంగా విదేశాల్లోని ఇతర భారతీయ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు.

బ్యాంకు అధికారులు జారీ చేసిన ఈ మోసపూరిత ఎల్ వోయూల వివరాలను పీఎన్‌బీ ప్రధాన బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ లో నమోదు చేయకుండా దాచిపెట్టారు.కేవలం అంతర్జాతీయ నిధుల బదిలీ వ్యవస్థ అయిన స్విఫ్ట్ ద్వారానే సమాచారాన్ని పంపి, చాలా సంవత్సరాల పాటు ఈ కుంభకోణం బయటపడకుండా మేనేజ్ చేశారు. బ్యాంకు నుంచి తీసుకున్న వేల కోట్ల రూపాయలను ముత్యాలు, రత్నాల ఎగుమతి, దిగుమతుల పేరుతో దుబాయ్, హాంకాంగ్‌లలో తానే సృష్టించిన డొల్ల కంపెనీలకు మళ్లించారు.

Nirav Modi

ఈ మొత్తాలను తన వ్యక్తిగత ఆస్తులు, లగ్జరీ వస్తువుల కొనుగోలుకు ఉపయోగించుకున్నట్లు ఈడీ ఆరోపించింది. కుంభకోణం బయటపడకముందే 2018 జనవరిలో భారతదేశం వదిలి పారిపోయిన నీరవ్ మోదీ కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని, తన కంపెనీలలో పనిచేసే డమ్మీ డైరెక్టర్లను బెదిరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లోని లండన్ జైలులో ఉన్న నీరవ్ మోదీకి యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో అప్పీల్ కూడా తిరస్కరణకు గురికావడంతో త్వరలోనే భారత్‌ కు అప్పగించనున్నారు.

Mohanlal : మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు..హైకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ

Exit mobile version