Mobile Recharge
మొబైల్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు మరోసారి గట్టి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. జియోతో పోటీ పడి తగ్గింపులు మీద తగ్గింపు రీఛార్జ్ ప్లాన్స్ ఇచ్చిన టెలికాం కంపెనీలు.. రెండేళ్లుగా వరుస పెట్టి మరీ వడ్డింపులు మొదలెడుతున్నాయి. దీనికి తోడు తాజాగా మళ్లీ ధరలు పెంచడం హాట్ టాపిక్ అయింది.
రానున్న 3 – 4 నెలల్లో మొబైల్ రీఛార్జ్(Mobile Recharge) ప్లాన్ల ధరలు 12 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉందని .. బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ లేటెస్ట్ రిపోర్టులో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తరణ కోసం టెలికాం కంపెనీలు భారీగా చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకోవడానికే ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో పోటీ తగ్గడం కూడా కంపెనీలకు అనుకూలంగా మారింది.
దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ కంపెనీలు పోటీ పడేలా ఆఫర్స్ ఇస్తూ.. ప్రతి నెలా లక్షలాది మంది కొత్తవారిని ఆకర్షిస్తున్నాయి. క్వార్టర్లీ బేసిస్ మీద జియోకు సగటున 70 లక్షల మంది, ఎయిర్టెల్కు 50 లక్షల మంది కొత్త యూజర్లు తోడవుతుండగా, వొడాఫోన్ ఐడియా మాత్రం కేవలం 2 లక్షల మందిని యాడ్ చేసుకుంటూ వెనుకబడి ఉంది.
ఇప్పటికే జియో, ఎయిర్టెల్ కంపెనీలు దేశంలోని 90 శాతానికి పైగా జిల్లాల్లో తమ 5జీ సర్వీసులను విస్తరించగా, వొడాఫోన్ ఐడియా కూడా సుమారు 100 నగరాల్లో 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చింది.
వినియోగదారులు వేగంగా 2జీ నుంచి 4జీ, 5జీ నెట్వర్క్లకు చేంజ్ అవడం, అలాగే పోస్ట్పెయిడ్ ప్లాన్లను సెలక్ట్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో టెలికాం సంస్థల యావరేజ్ ఇన్కమ్ కూడా మెరుగుపడనుంది. జూన్ త్రైమాసికంలో ఈ ఇన్కమ్ 1 నుంచి 1.5 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 4జీ, 5జీ డేటా వినియోగం విపరీతంగా పెరుగుతున్న సమయంలో కంపెనీలు టారిఫ్ ధరలను పెంచాలని చూస్తుండటంతో, మొబైల్ బిల్లుల(Mobile Recharge) బడ్జెట్ను మరింత పెంచేలా కనిపిస్తోందని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.
