Just Andhra PradeshJust PoliticalLatest News

Janasena : అరవ శ్రీధర్ ఎపిసోడ్.. బొలిశెట్టి గుడ్ బై..జనసేన పార్టీలో ఏం జరుగుతోంది ?

Janasena : బొలిశెట్టి సత్యనారాయణ జనసేనకు షాకిచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచీ కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన తాత్కాలికంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు

Janasena

రాజకీయాల్లో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు.. ఒక పార్టీ నడపడం సులభం కాదు.. సామాన్య కార్యకర్త నుంచి కీలక నేతల వరకూ అందరినీ సంతృప్తిపరచాలి.. అదే సమయంలో వారి వ్యక్తిగత వివాదాలతో పార్టీకి కూడా తీవ్ర నష్టం కూడా కలుగుతుంది.. అలాగే పార్టీలో అంతర్గత అసంతృప్తి వంటి వాటిని సకాలంలో చక్కదిద్దుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన పవన్ పాలనాపరంగా మంచి మార్కులే తెచ్చుకుంటున్నారు. కానీ పార్టీలో వరుస పరిణామాలు జనసేనానికి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. వీటిలో ముందు చెప్పుకోవాల్సింది ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారమే. అరవ శ్రీధర్ తనను మోసం చేసాడని, లైంగికంగా వేధించాడంటూ ఒక మహిళ రచ్చకెక్కడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కొన్నిరోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా నిలిచాయి.

ఇది వారి వ్యక్తిగత వ్యవహారమే అయినా సరే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అందరికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీంతో ప్రతిపక్ష వైసీపీకి అరవ శ్రీధర్ ఎపిసోడ్ అస్త్రంగా మారింది. మహిళల రక్షణ అంటూ మాట్లాడే పవన్ ..తమ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల విషయంలో ఏం సమాధానం చెబుతారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. దీనిపై జనసేన(Janasena) పార్టీ పరంగా ఆలస్యంగా స్పందించినా కూడా వెంటనే  కమిటీ వేసి విచారణకు ఆదేశించింది.

అది పూర్తయ్యే వరకూ అరవ శ్రీధర్ ను పక్కన పెట్టింది. ఇప్పటికే తాజాగా జరిగిన జనసేన(Janasena) మీటింగ్ లో పవన్ తమ పార్టీ నేతలకు ఫుల్ క్లాస్ తీసుకున్నారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో పార్టీ నేతలు సరైన విధంగా స్పందించకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వ్యక్తిగత వ్యవహారాల్లో ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని కూడా హెచ్చరించారు.

ఇదిలా ఉంటే తాజాగా బొలిశెట్టి సత్యనారాయణ జనసేనకు షాకిచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచీ కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన తాత్కాలికంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు . ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో ఉన్న కేసు కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

Janasena
Janasena

పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కేసులో తానే ప్రతివాదిగా ఉండడంతో ఆ శాఖకు మంత్రిగా ఉన్న పవన్ కు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పార్టీ నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవలే కూటమిలో జనసేన(Janasena)కు అన్యాయం జరుగుతుందంటూ బొలిశెట్టి వీడియో విడుదల చేశారు. నామినేటెడ్ పదవుల్లో జనసేనను తొక్కేస్తున్నారని, క్షేత్రస్థాయిలో పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు సమాచారం.

పార్టీలో అంతర్గతంగా చర్చించకుండా , ఇలా వీడియో విడుదల చేయడాన్ని జనసేన క్రమశిక్షణ కమిటీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పొమ్మనలేక పొగబెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వరుస పరిణామాలతో పార్టీలో తలెత్తిన ఈ ఇబ్బందులను పవన్ ఎలా చక్కబెడతారో చూడాలి.

T20 World Cup : టీ20 వరల్డ్ కప్… ఐపీఎల్..ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ధనాధన్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button