Women
ఆంధ్రప్రదేశ్లోని పొదుపు సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ వేళ గొప్ప శుభవార్త అందించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన సీఎం.. ఇకపై డ్వాక్రా సంఘాల సభ్యులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ‘ఆన్లైన్ రుణ సదుపాయాన్ని’ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
దీనికోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు డ్రాక్రా సంఘంలో వారు రుణం పొందాలంటే బ్యాంకు అధికారులను కలవడం, దానికి సంబంధించిన పత్రాలను సమర్పించడం వంటి ప్రక్రియల వల్ల చాలా సమయం వేస్ట్ అయ్యేది. కానీ ఈ కొత్త విధానం ద్వారా మహిళలు(Women) తమ మొబైల్ నుంచే రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన కొద్ది కాలంలోనే నేరుగా వారి అకౌంట్లలోకి డబ్బులు జమ అయ్యేలా డిజిటల్ వ్యవస్థను రూపొందిస్తున్నారు.
ముఖ్యంగా స్త్రీ నిధి , ఉన్నతి వంటి పథకాల ద్వారా అందజేసే వడ్డీ లేని రుణాలను కూడా ఇకపై ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారానే పొందొచ్చు. ఇప్పటికే ప్రభుత్వం డ్వాక్రా మహిళలందరికీ స్మార్ట్ ఫోన్లు అందించడంతో పాటు, మన డబ్బులు – మన లెక్కలు అనే యాప్ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా ప్రతి మహిళ తన సంఘానికి సంబంధించిన లావాదేవీలు, చెల్లించిన కంతులు, మిగిలి ఉన్న బకాయిలు , వడ్డీ వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు.
దీనికి తోడు ఇప్పుడు రుణ ప్రక్రియ కూడా ఆన్లైన్ కావడంతో మహిళలకు ఎంతో ఊరట లభించనుంది. ఏపీలో సుమారు 1.13 కోట్ల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండి, సుమారు 26 వేల కోట్ల నిధుల సమీకరణతో రికార్డు సృష్టించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
డ్వాక్రా గ్రూపులను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇటీవల కొత్త సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ కింద ఒక్కో గ్రూపు ఖాతాలో 15 వేల రూపాయలను జమ చేసింది. ఈ నిధులు మహిళల(Women) ఖాతాల్లో ఉండటం వల్ల..ఇకపై బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. ఈ నిధులను ప్రభుత్వం తిరిగి తీసుకోదని, ఇది కేవలం మహిళల ఆర్థిక పురోభివృద్ధి కోసమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ వేళ అటు డిజిటల్ పరిజ్ఞానాన్ని, ఇటు ఆర్థిక వెసులుబాటును కూడా మహిళలకు చేరువ చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తోంది.
