Cold wave: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పెరిగిన చలి..సాధారణం కంటే 4°C తగ్గుదల
Cold wave: సాయంత్రం 6 గంటలు దాటితే మొదలయ్యే చల్లటి గాలులు, మళ్లీ ఉదయం 9 గంటల వరకు వదలడం లేదు.
Cold wave
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను చలి(Cold wave) తీవ్రత వణికిస్తోంది. సాధారణంగా నవంబర్ మాసంలో ఉండే చలి కంటే, ఈసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు (Minimum Temperatures) నమోదు అవుతుండటంతో ప్రజలు గజగజా వణుకుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితే మొదలయ్యే చల్లటి గాలులు(Cold wave), మళ్లీ ఉదయం 9 గంటల వరకు వదలడం లేదు.
ఉదయం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో దట్టమైన మంచు కూడా కురుస్తోంది. చలి తీవ్రత (Cold wave)పెరగడంతో చిన్నారులు, వృద్ధులు ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నారు, దీంతో గ్రామాల ప్రజలు చలి మంటలతో సేద తీరుతూ కనిపిస్తున్నారు..
తాజా సమాచారం ప్రకారం, తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ప్రాంతాల్లో సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ అగ్రస్థానంలో ఉంది, ఇక్కడ కేవలం 7.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రత 9.1 డిగ్రీలుగా నమోదైంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఉదయం 9 గంటల కంటే ముందుగా ఇళ్లనుంచి బయటకు వెళ్లడానికి ఆలోచిస్తున్నారు.

అంతేకాదు, ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి.మాడుగులలో కేవలం 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గతంతో పోలిస్తే, ఈ ఏడాది ఏపీలో కూడా చలి ప్రభావం ఎక్కువగా ఉండటం విశేషం.
సాధారణంగా, తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈసారి ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో చలి పెరగడానికి వాతావరణ శాఖ (IMD) నిపుణులు ప్రధానంగా మూడు కారణాలను సూచిస్తున్నారు:
ఉత్తర గాలుల ప్రభావం.. ఉత్తర భారతదేశం నుంచి, ముఖ్యంగా హిమాలయాల వైపు నుంచి చల్లటి గాలులు (Cold Winds) నేరుగా దక్కన్ పీఠభూమి వైపు వీయడం వలన చలి పెరుగుతుంది. ఈ గాలుల ప్రవాహం (Flow) ఈ సంవత్సరం బలంగా ఉండటం వల్ల ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతంపై కూడా ప్రభావం చూపుతోంది.
పశ్చిమ గాలులు లేకపోవడం.. బంగాళాఖాతం వైపు నుంచి సాధారణంగా వచ్చే తేలికపాటి పశ్చిమ గాలులు (Westerly Winds) ఈ సమయంలో బలంగా లేకపోవడం వల్ల చల్లటి ఉత్తర గాలులు నిరాటంకంగా ప్రవహిస్తున్నాయి.
మేఘాలు లేని ఆకాశం.. రాత్రి పూట ఆకాశం నిర్మలంగా (Cloudless Sky) ఉన్నప్పుడు, భూమి ఉపరితలం నుంచి వేడి (Heat) త్వరగా వాతావరణంలోకి విడుదల అవుతుంది. దీంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి.
ఇక వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం, తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా వీయొచ్చని అధికారులు హెచ్చరించారు. దీనికోసం, ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.



