gold rate: ట్రంప్ ఎఫెక్ట్తో మళ్లీ లక్షకు చేరిన బంగారం ధరలు.. ఇంకా పెరుగుతుందా..?
gold rate: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు మరోసారి అంతర్జాతీయ మార్కెట్లను వణికించాయి. ముఖ్యంగా బంగారం ధర (Gold Rate) అమాంతం పెరిగి, 10 గ్రాముల ధర లక్ష రూపాయల మార్కుకు చేరువయ్యింది.

Gold Rate: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు మరోసారి అంతర్జాతీయ మార్కెట్లను వణికించాయి. ముఖ్యంగా బంగారం ధర (Gold Rate) అమాంతం పెరిగి, 10 గ్రాముల ధర లక్ష రూపాయల మార్కుకు చేరువయ్యింది. గత నెల చివరి వారం రూ. 90,000 కు పడిపోయిన పసిడి ధర, ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుని వినయోగదారులకు షాక్ ఇచ్చింది. కేవలం వారం రోజుల్లోనే పది గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 1,700 పెరిగింది.
బంగారం, వెండి ధరలు పెరగడానికి వెనుక అసలు కథ..
ట్రంప్ ఇచ్చిన కీలక ప్రకటన, ప్రపంచ మార్కెట్లను (Global Markets) తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ఆగస్టు 1 నుంచి మెక్సికోతో పాటు యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 30% సుంకాలు (Tariffs) విధిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇలాంటి వాణిజ్య యుద్ధం (Trade War) భయాలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని పెంచుతాయి. సహజంగానే, ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులు (Safe Haven Assets) అయిన బంగారంపై దృష్టి సారిస్తారు. అందుకే బంగారానికి డిమాండ్ పెరిగి, దాని ధరలు మూడు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
బంగారంతో పాటు వెండి ధర (Silver Rate) కూడా ఇదే బాటలో పయనించి, ఆల్ టైం గరిష్ట స్థాయి (All-time High)కి చేరుకుంది. గత వారం రోజుల్లో కిలో వెండి ధర రూ. 5,000 మేర పెరిగింది.
సోమవారం ఉదయం నాటికి, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 170, 22 క్యారెట్ల బంగారంపై రూ. 150 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ బంగారం $3,357 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు:
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి.
బంగారం ధరలు:..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 91,550కి చేరగా, 24 క్యారెట్ల ధర రూ. 99,880కి చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,700కు, 24 క్యారెట్ల ధర రూ. 1,00,030కు చేరుకుంది.
ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 91,550 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 99,880గా నమోదైంది.
వెండి ధరలు..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర స్వల్పంగా పెరిగి, రూ. 1,25,000 మార్కుకు చేరుకుంది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,15,000 వద్ద ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,25,000 వద్ద కొనసాగుతుంది.
ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ అనిశ్చితి (Geopolitical Instability), ముఖ్యంగా వాణిజ్య విధానాల్లో అస్థిరత (Trade Policy Volatility). ట్రంప్ వంటి నాయకుల రక్షణవాద విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణ భయాలు పెరిగి, కరెన్సీల విలువ పడిపోయే ప్రమాదం ఉన్నప్పుడు, బంగారం వంటి ఆస్తులు కొనిపెట్టుకుంటే..అది తమ విలువను నిలుపుకుంటాయని పెట్టుబడిదారులు నమ్ముతారు. ఇది బంగారానికి డిమాండ్ను పెంచుతుంది.
భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉండనున్నాయో అంచనా వేయడం కష్టం. అయితే, ప్రపంచ ఆర్థిక స్థితి, ద్రవ్యోల్బణ అంచనాలు, కేంద్ర బ్యాంకుల విధానాలు, రాజకీయ పరిణామాలు బంగారం ధరల పెరగడం, తగ్గడంపై ప్రభావం చూపిస్తాయి.