Water Memory:కోపంగా, బాధగా ఉన్నప్పుడు నీళ్లు తాగుతున్నారా? నీళ్లు అన్నీ గుర్తు పెట్టుకుంటాయట ..
Water Memory: భారతీయ సంప్రదాయంలో గంగాజలాన్ని పరమ పవిత్రంగా భావించడం, ఏదైనా పూజ చేసేటప్పుడు నీటిని మంత్రాలతో అభిమంత్రించడం వెనుకున్న ఉద్దేశ్యం కూడా ఇదే కావొచ్చు.

Water Memory
మనం రోజూ తాగే నీరు గురించి మనలో చాలామందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన ప్రపంచం ఉంది. నీటికి కేవలం రుచి, రంగు మాత్రమే ఉందని అనుకుంటారు. కానీ నీటికి జ్ఞాపకశక్తి (Water Memory) కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అవును..నీటి చుట్టూ ఉండే వాతావరణంతో పాటు చివరకు మనం మాట్లాడే మాటలు, అంతెందుకు ఆఖరికి మన మనసులోని ఆలోచనలను కూడా నీరు గ్రహిస్తుందని కొన్ని పరిశోధనలు నిరూపించాయి. ఈ కాన్సెప్ట్ వినడానికి వింతగా ఉంటున్నా కూడా , దీని వెనుక జపాన్ శాస్త్రవేత్త అయిన డాక్టర్ మసారు ఎమోటో చేసిన ప్రయోగాలు మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి.
కొన్ని నీటి శాంపిల్స్ తీసుకుని, డాక్టర్ మసారు ఎమోటో ..వాటికి వేర్వేరు రకాల మ్యూజిక్ను వినిపించారు. ఆ తర్వాత మరికొన్ని వాటర్ బాటిళ్లపై ప్రేమ, కృతజ్ఞత వంటి పాజిటివ్ పదాలను, ఇంకొన్నింటిపై ద్వేషం, కోపం వంటి నెగెటివ్ పదాలను రాసి వాటిని బయటకు ఉచ్ఛరించారు. ఆ తర్వాత ఆ నీటిని గడ్డకట్టించి (Freeze),ఆ తర్వాత వాటి స్పటికాలను (Crystals) మైక్రోస్కోప్ కింద పరిశీలించారు.
ఆశ్చర్యకరంగా, పాజిటివ్ పదాలు విన్న నీటి స్పటికాలు అద్భుతమైన వజ్రాల ఆకారంలో అందంగా ఏర్పడ్డాయి. అదే సమయంలో నెగటివ్ మాటలు, నెగెటివ్ పదాలు అంటించిన నీటి స్పటికాలు చిందరవందరగా, వికృతంగా మారాయి. అంటే దీన్ని బట్టి మన మూడ్ ప్రభావం నీటిపై ఉంటుందని ఆయన తన పరిశోధనలు తెలిపాయి.
మరోవైపు, హోమియోపతి వైద్య విధానం కూడా ఈ వాటర్ మెమరీ(Water Memory) సూత్రం మీదే ఆధారపడి పనిచేస్తుందని కొంతమంది సైంటిస్టులు కూడా నమ్ముతారు. నోబెల్ బహుమతి గ్రహీత లూక్ మాంటాగ్నియర్ వంటి వాళ్లు నీటిమీద ఉన్న అణువుల సమాచారాన్ని తరంగాల రూపంలో నిక్షిప్తం చేసుకుంటుందని తమ పరిశోధనల్లో ఇప్పటికే తెలిపారు.

దీనిని బట్టి మన బాడీలో సుమారు 70 శాతం నీరే ఉంటుంది. కాబట్టి, మనం కోపంగా ఉన్నప్పుడు కానీ చిరాకుగా ఉన్నప్పుడు నీళ్లు తాగితే, ఆ నీటి అణువులు మన బాడీలోని కణాలపై నెగెటివ్ ప్రభావం చూపిస్తాయని, అదే ప్రశాంతంగా, దైవచింతనతో కానీ సంతోషంగా కానీ తాగితే అది అమృతంలా పనిచేస్తుంది. ఈ విషయాన్ని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతుంటారు.
అంతెందుకు భారతీయ సంప్రదాయంలో గంగాజలాన్ని పరమ పవిత్రంగా భావించడం, ఏదైనా పూజ చేసేటప్పుడు నీటిని మంత్రాలతో అభిమంత్రించడం వెనుకున్న అసలు ఉద్దేశ్యం కూడా ఇదే కావొచ్చు. నీటికి ఉండే ఈ గ్రహణ శక్తే మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
అందుకే ప్రతీ ఒక్కరూ నీటిని తాగే ముందు ఒక్క క్షణం కృతజ్ఞతతో కానీ ప్రశాంతమైన మనసుతో కానీ తాగడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల నీళ్లు దాహాన్ని తీర్చడమే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు. మొత్తంగా నీరు కేవలం జీవనాధారమే కాదు, అది మన భావోద్వేగాలను కూడా మోసే ఒక సజీవ మాధ్యమం అని తెలుస్తోంది.



