Ajit Pawar:మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ లోటు.. .. భారత రాజకీయాల్లో విమాన ప్రమాదాల విషాద చరిత్రకు ముగింపు లేదా?

Ajit Pawar: ముంబై నుంచి బారామతికి ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరిన అజిత్ పవార్ ప్రైవేట్ విమానం, గమ్యస్థానానికి చేరుకోవడానికి కేవలం కొద్ది నిమిషాల ముందే కుప్పకూలిపోయింది.

Ajit Pawar

మహారాష్ట్ర రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసిన నేత, డెప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar)విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరిన అజిత్ పవార్ ప్రైవేట్ విమానం, గమ్యస్థానానికి చేరుకోవడానికి కేవలం కొద్ది నిమిషాల ముందే కుప్పకూలిపోయింది.

సాంకేతిక లోపం కారణంగా పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించినా, విమానం అదుపు తప్పి పొలాల్లో పడిపోయి రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌(Ajit Pawar)తో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర సీఎం  దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు.

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద శూన్యాన్ని సృష్టించిందనే చెప్పొచ్చు. ఎన్సీపీ (అజిత్ గ్రూప్) కు ఆయనే వెన్నుముక. ఇప్పుడు ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. బారామతి జిల్లా పరిషత్ ఎన్నికల వేళ ఈ ఘటన జరగడం ఆ పార్టీ కేడర్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది.

రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం, అజిత్ పవార్ లేని లోటును భర్తీ చేయడం ఎన్సీపీకి దాదాపు అసాధ్యమే. ఇది శరద్ పవార్‌కి మళ్లీ పార్టీపై పట్టు సాధించే అవకాశం ఇస్తుందా లేక బీజేపీకి మరింత బలాన్ని చేకూరుస్తుందా అన్నది వేచి చూడాలి. అయితే ముఖ్యంగా బారామతి నియోజకవర్గంలో పవార్ కుటుంబ పట్టును ఈ ఘటన తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముంది.

భారతదేశ రాజకీయ చరిత్రను గమనిస్తే, విమాన , హెలికాప్టర్ ప్రమాదాలు ఎందరో ధీశాలి నాయకులను మనకు దూరం చేశాయి. 1980లో సంజయ్ గాంధీ మరణం కాంగ్రెస్ పార్టీ దిశను మార్చేసింది. పైలటింగ్ పట్ల ఆసక్తి ఉన్న సంజయ్, లో-ఫ్లైయింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఢిల్లీ సమీపంలో విమానం కూలడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతే రాజీవ్ గాంధీ అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.

అలాగే ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం కేవలం పార్టీనే కాదు వైఎస్ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసింది. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీని స్థాపించి .. ఏపీలో అధికారం చేపట్టిన తీరు మనందరికీ తెలిసిందే.

Ajit Pawar

స్టాటిస్టిక్స్ ప్రకారం, 1952 నుంచి ఇప్పటివరకు దాదాపు 15 మందికి పైగా కీలక రాజకీయ నేతలు గగనతల ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 45 శాతం పైలట్ పొరపాట్ల వల్ల జరిగితే, మరో 30 శాతం అజిత్ పవార్ ఘటనలాగే సాంకేతిక లోపాల వల్ల సంభవించగా.. మిగిలినవి వాతావరణ పరిస్థితుల వల్ల జరిగినవి. ప్రతి ప్రమాదం వెనుక ఒక రాజకీయ మలుపు దాగి ఉంది. మరి అజిత్ పవార్ మరణం దేనికి దారి తీస్తోందో చూడాలి.

కాగా ప్రస్తుత అజిత్ పవార్ ప్రమాదంపై డీజీసీఏ (DGCA) ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. విమానం రెండు ముక్కలై మంటలు చెలరేగడం చూస్తుంటే, సాంకేతిక లోపంతో పాటు ఇంజన్ విఫలమై ఉండవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. బ్లాక్ బాక్స్ లభ్యమైతేనే అసలు కారణాలు వెల్లడవుతాయి. రాజకీయ ప్రముఖులు వాడే చిన్న ప్రైవేట్ విమానాల మెయింటెనెన్స్ విషయంలో నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నారనేది మరోసారి పెద్ద చర్చగా మారింది.

Sammakka Sarakka Jatara:కన్నుల పండువగా వనదేవతల మహాజాతర ..ఏ రోజు ఏం జరుగుతుంది?

Exit mobile version