Cab Strike :ఓలా,ఉబర్,ర్యాపిడో క్యాబ్స్ సమ్మె..ఎందుకు ? ఎక్కడ?
Cab Strike : కిలోమీటరుకు కనీసం 25 రూపాయలు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల వాహనాలను తమ రాష్ట్రంలోకి రావడాన్ని అడ్డుకోవాలి డిమాండ్ చేస్తున్నారు.
Cab Strike
దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు సమ్మెకు సై అంటున్నారు. ఫిబ్రవరి 7న ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త బంద్( Cab Strike)కు పిలుపునిచ్చారు. కిలోమీటరుకు కనీసం 25 రూపాయలు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల వాహనాలను తమ రాష్ట్రంలోకి రావడాన్ని అడ్డుకోవాలి డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ వివాదాన్ని పరిశీలిస్తే దీనిలో మూడు ప్రధాన కోణాలు కనిపిస్తున్నాయి. అవి డ్రైవర్ల కష్టం, కంపెనీల లెక్కలు అలాగే చివరగా సామాన్య కస్టమర్ భవిష్యత్తు అనే కోణాలు చూడొచ్చు.
ముందుగా డ్రైవర్ల ఆవేదన చూస్తే..ఆదాయం అంతా కమిషన్లకే పోతుందని..అది కంపెనీల ఏకపక్ష కమిషన్లు అని చాలా కాలంగా యాప్ ఆధారిత డ్రైవర్లు ఒకే ఫిర్యాదు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని..అయినా సరే వాహన నిర్వహణ ఖర్చులన్నీ భరిస్తూ, చివరకు తక్కువ రేటుకు రైడ్స్ చేయడం తమ వల్ల కాదని డ్రైవర్లు వాదిస్తున్నారు.
ఇన్సూరెన్స్, టైర్లు, సర్వీసింగ్ ఖర్చులు పోగా ఇంటికి తీసుకెళ్లే ఆదాయం సున్నా అని డ్రైవర్లంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమను పార్ట్నర్లుగా కాకుండా కనీస సౌకర్యాలు పొందే కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ కోరుతున్నారు. దీనివల్ల తమకు పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక కంపెనీల లాజిక్ ఓసారి చూస్తే..వారికి ప్లాట్ఫామ్ ఇచ్చింది తామే కదా ,అందుకేగా డ్రైవర్లకు ఉపాధి దొరుకుతోంది అని వాదిస్తున్నాయి. అంటే అది తమ యాప్ , బ్రాండ్ వల్లేనని వారు గుర్తు చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి టెక్నాలజీ, మ్యాప్స్, కస్టమర్ కేర్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు కమిషన్ తీసుకోవడంలో తప్పేముందని కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి.
ఒకవేళ డ్రైవర్లు అడిగినట్లు ఛార్జీలు పెంచితే, కస్టమర్లు క్యాబ్లను వదిలేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు వెళ్లిపోతారని, అది చివరకు డ్రైవర్లకే అది నష్టమని హెచ్చరిస్తున్నాయి.

కాగా ఈ ఇద్దరి పోరులో చివరకు బలైపోయేది తామేనని మధ్యతరగతి కస్టమర్లు అంటున్నారు. ఇప్పటికే సర్జ్ ప్రైసింగ్ పేరుతో కంపెనీలు చుక్కలు చూపిస్తూ ఉంటే, ఇప్పుడు బేస్ ఫేర్ కూడా పెరిగితే సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్యాబ్స్ సమ్మె( Cab Strike) వల్ల ఆఫీసులకు వెళ్లేవారు, ఆసుపత్రికి వెళ్లేవారు చాలా ఇబ్బందులు పడతారు. చార్జీలు పెరిగితే కస్టమర్లు మళ్లీ సొంత వాహనాల వైపు లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు వెళ్లే అవకాశం ఉంది.
ఇటు డ్రైవర్ల డిమాండ్ ప్రకారం కిలోమీటరుకు రూ. 25 అంటే ప్రస్తుతం ఉన్న ధర కంటే అది చాలా ఎక్కువ అవుతుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. ఒక మినిమమ్ ఫేర్ నిర్ణయించాల్సిన అవసరం ఉందని సామన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అటు డ్రైవర్ కష్టానికి ప్రతిఫలం దక్కాలి, ఇటు కస్టమర్ మీద కూడా విపరీతమైన భారం పడకూడదు. ఈ సమతుల్యతను సాధించడమే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న అతిపెద్ద సవాల్.



