Road accidents: రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆందోళన – తక్షణ చర్యలకు ఆదేశం
Road accidents: ఎన్హెచ్ఏఐ , కేంద్ర రవాణా శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Road accidents
జాతీయ రహదారుల(Road accidents)పై పెరుగుతున్న ప్రమాదాల విషయంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటో (Suo Motu)గా విచారణ చేపట్టింది. జస్టిస్ జేకే మహేశ్వరి , జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా అనుమతి లేని దాబాలు , అధ్వానంగా ఉన్న రోడ్ల నిర్వహణ కారణమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో 19 మంది, రాజస్థాన్లోని ఫాలోడీలో 18 మంది మరణించిన ఘటనలను ప్రస్తావిస్తూ, ఎన్హెచ్ఏఐ (NHAI), కేంద్ర రవాణా శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జాతీయ రహదారుల(Road accidents)పై (National Highways) జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని, తక్షణ నివారణా చర్యలపై ప్రభుత్వాలకు నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఇది దేశంలో రోడ్డు భద్రత (Road Safety) పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలియజేస్తుంది.

ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల ప్రమాద గణాంకాలు..
ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టం యొక్క తీవ్రత స్పష్టమవుతుంది. 2019-2023 మధ్య కాలంలో ప్రమాదాలు సగటున 20,000 పైగా నమోదు అవుతున్నాయి. ప్రతి సంవత్సరం 7,000 నుంచి 8,200 మందికి పైగా వ్యక్తులు మరణిస్తున్నారు.
ముఖ్యంగా 2023 లోనే 19,949 ప్రమాదాలు జరిగి, 8,137 మంది మరణించగా, 20,409 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ గణాంకాల్లో 50 శాతం పైగా మరణాలు బైక్ రైడర్లవే కావడం అతి పెద్ద ఆందోళన కలిగించే విషయంగా ధర్మాసనం భావిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం సుమారు రెండు వేల మంది బైక్ నియంత్రణ లోపం కారణంగా మరణిస్తున్నారు.
ప్రమాదాలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. వీటిలో డ్రైవర్ల నిర్లక్ష్యం , రోడ్ల మౌలిక సదుపాయాల లోపాలు రెండూ ఉన్నాయి.
అత్యంత కీలకమైన కారణం ఓవర్ స్పీడ్. మొత్తం ప్రమాదాలలో 70-80 శాతం వరకు అతి వేగంతో వాహనం నడపడం వల్లే జరుగుతున్నాయి.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ,వీకెండ్స్లో మద్యం సేవించి వాహనం నడపడం వలన ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి.
ద్వి చక్రాల వాహనదారులలో 74-78 శాతం మంది హెల్మెట్ ధరించడం లేదు. ఇది కాకుండా, 98 శాతం మంది వెనుక కూర్చునే (Pillion Riders) వారు కూడా హెల్మెట్ పెట్టుకోవడం లేదు.కారులో ప్రయాణించేవారు సీట్బెల్ట్ వాడకంలోనూ ఇదే నిర్లక్ష్యం కనిపిస్తుంది.
పర్మిషన్ లేని దాబాలు, హోటళ్లు రోడ్లకు ఆనుకుని ఉండటం, రోడ్డు గుంతలు, సరైన లైటింగ్, సైన్బోర్డులు లేకపోవడం , బ్లాక్ స్పాట్లను (Black Spots) సరిదిద్దకపోవడం వంటివి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
రాత్రి వేళల్లో హైవేలపై డ్రైవింగ్ చేసే బస్సు, ట్రక్ డ్రైవర్లు అతిగా పనిచేయడం వల్ల అలసట (Fatigue)కు గురై నియంత్రణ కోల్పోవడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
ఈ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వాలకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్మిషన్ లేని దాబాలపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని, NHAI (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ), రవాణా శాఖ , రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నోటీసులు ఇచ్చింది.

ప్రభుత్వాలు దీనికి ప్రతిస్పందిస్తూ రోడ్ల పరిరక్షణ, మెరుగైన లైటింగ్, పాదచారుల కోసం సురక్షిత మార్గాలు, సీసీటీవీ పర్యవేక్షణ (CCTV Surveillance) ,పెట్రోలింగ్ మెరుగుదల వంటి చర్యలను చేపట్టాయి. అంతేకాక, బ్లాక్ స్పాట్స్ ను సరిదిద్దడం, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ (ITS) మరియు AI పర్యవేక్షణ వంటి ఆధునిక సాంకేతికతలను నూతనంగా అమలులోకి తీసుకువస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు ఆరు నెలల్లోగా కొత్త రోడ్డు భద్రతా నియమాలను రూపొందించాలని ఆదేశించడం జరిగింది.
ప్రమాదాల(Road accidents)ను తగ్గించడానికి ప్రభుత్వ స్థాయి నుంచి ప్రజల స్థాయిలో ఏకకాలంలో చర్యలు తీసుకోవడం అత్యవసరం. ప్రభుత్వాలు ముందుగా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అన్ని రోడ్లను బాగుచేయించాలి. గుంతలు లేకుండా చూడాలి. అలాగే టర్నింగ్స్ దగ్గర డేంజర్ సైన్ బోర్డ్స్ పెట్టించాలి. స్పీడ్ గవర్నర్లు (Speed Governors) , ఆల్కహాల్ చెకింగ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవర్లకు నిరంతర శిక్షణ ఇవ్వాలి.
హెల్మెట్ , సీట్బెల్ట్ను తప్పనిసరి చేసి, ఉల్లంఘించిన వారికి జరిమానాలను పెంచడం ద్వారా ట్రాఫిక్ నిబంధనల అమలును కఠినతరం చేయాలి. AI-ఆధారిత స్మార్ట్ కెమెరాలు , డ్రోన్ల ద్వారా రవాణా వ్యవస్థను పర్యవేక్షించడం ద్వారా ఉల్లంఘనలను గుర్తించాలి.
“ఓవర్ స్పీడ్ కన్నా జీవితమే ముఖ్యం” అనే నినాదంతో పిల్లలు, యువత కోసం ప్రత్యేక అవగాహన ప్రచారాలు (Special Awareness Campaigns) నిర్వహించాలి. హెల్మెట్ మరియు సీట్బెల్ట్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలి. రాత్రివేళ డ్రైవింగ్ చేసే డ్రైవర్లు ఒత్తిడి లేకుండా, తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాతే వాహనం నడపడంపై అవగాహన కల్పించాలి.
మొత్తంమీద, రోడ్డు ప్రమాదాల(Road accidents)ను తగ్గించడంలో విజయం సాధించాలంటే, సరికొత్త రోడ్డు భద్రతా చట్టాలను కఠినంగా అమలు చేయడం, భయపెట్టే జరిమానాలు విధించడం, సాంకేతిక పర్యవేక్షణ మరియు ప్రజల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు – ఈ నాలుగు అంశాలు కలిస్తేనే ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో విజయం సాధించవచ్చు.



