Bala Brahmeswara Swamy:బాల బ్రహ్మేశ్వరుడి అభిషేక జలం ఎక్కడికి పోతుంది?..1300 ఏళ్లుగా అంతుచిక్కని మిస్టరీ
Bala Brahmeswara Swamy:ఆలంపూర్ బాల బ్రహ్మేశ్వర లింగానికి భక్తులు ఎన్ని బిందెలతో, ఎన్ని ట్యాంకుల నిండా నీళ్లతో అభిషేకం చేసినా... ఆ నీరంతా నిమిషాల వ్యవధిలో మాయమవుతుంది.
Bala Brahmeswara Swamy
తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో, తుంగభద్ర నది ఒడ్డున కొలువైన పుణ్యక్షేత్రం ఆలంపూర్. దీన్ని దక్షిణ కాశీగానూ, నవబ్రహ్మేశ్వర క్షేత్రంగానూ పిలుస్తారు. ఇక్కడ ప్రధానంగా దర్శించుకోవలసిన నవబ్రహ్మ ఆలయ సముదాయంలో అత్యంత అద్భుతమైన, అంతుచిక్కని రహస్యాన్ని దాచుకున్నాడు శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి(Bala Brahmeswara Swamy).
ఈ ఆలయం క్రీ.శ. 7వ శతాబ్దంలో చాళుక్య రాజుల శైలిలో నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. ఇక్కడి ఆలయ నిర్మాణంలో ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే, ఎంతటి వేసవిలోనైనా, ఎంతటి వర్షంలోనైనా ఆలయం లోపల వాతావరణం, ఉష్ణోగ్రత ఒకేలా స్థిరంగా ఉంటుంది. అయితే, నిజమైన రహస్యం గర్భాలయంలో ఉంది.
ఆలంపూర్ బాల బ్రహ్మేశ్వర(Bala Brahmeswara Swamy) లింగానికి భక్తులు ఎన్ని బిందెలతో, ఎన్ని ట్యాంకుల నిండా నీళ్లతో అభిషేకం చేసినా… ఆ నీరంతా నిమిషాల వ్యవధిలో మాయమవుతుంది. అభిషేక జలం ఎంత సమర్పించినా, ఆ నీరు ఎటు పోతుందో, ఎక్కడికి ప్రవహిస్తుందో, భూమిలోకి ఇంకుతుందో ఏ ఒక్కరికీ ఈ రోజు వరకు అంతుచిక్కలేదు. శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు వచ్చి పరిశోధించినా ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు.

చాళుక్య రాజులు ఆలయాన్ని నిర్మించేటప్పుడు వాడిన వాస్తు పరిజ్ఞానం, హైడ్రాలజీ (Hydrology) టెక్నాలజీ దీని వెనుక దాగి ఉన్నాయని చాలామంది విశ్వసిస్తారు. గుడి నిర్మాణం సమయంలో, అభిషేక జలం బయటకు రాకుండా… ఆ నీరు ఆలయం లోపల ఉండే ఒక భూగర్భ జల వ్యవస్థ (Underground Drainage System) ద్వారా మళ్లీ తుంగభద్ర నదిలో కలిసేలా డిజైన్ చేసి ఉంటారని ఒక అంచనా. అయితే, ఈ భూగర్భ వ్యవస్థ ఎక్కడ మొదలవుతుంది, దాని మార్గం ఏమిటి అన్నది ఎప్పటికీ ఒక రహస్యమే. అభిషేకం పూర్తయిన తర్వాత, గర్భగుడిలో ఎక్కడా నీటి ఆనవాళ్లు ఉండకపోవడం భక్తులకు ఒక గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఈ బాల బ్రహ్మేశ్వర స్వామి (Bala Brahmeswara Swamy)ఆలయంలోని మరో అద్భుతం – ధ్వని శాస్త్రం (Acoustics). ఆలయం లోపల, గర్భగుడి గోడల వద్ద నిలబడి చేతితో చప్పట్లు కొడితే… ఆ చప్పుడు వెంటనే ప్రతిధ్వనించకుండా, దాదాపు రెండు సెకన్ల తర్వాత ఆలయం పైకప్పు నుంచి నెమ్మదిగా తిరిగి వస్తుంది. అప్పటి ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లో, శబ్ద తరంగాలను కూడా లెక్కించి, వాటిని ఆలయం నిర్మాణం లోపల నియంత్రించడం అనేది చాళుక్యుల వాస్తు గొప్పతనానికి నిదర్శనం.
బాల బ్రహ్మేశ్వరుడి(Bala Brahmeswara Swamy) దర్శనం తర్వాత, నవబ్రహ్మ ఆలయ సముదాయంలోని మిగతా ఎనిమిది లింగాలైన విశ్వబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, కుమారబ్రహ్మ లింగాలను కూడా భక్తులు తప్పక దర్శించుకుంటారు. నవబ్రహ్మలు కొలువై ఉండడం వల్ల ఈ క్షేత్రం, బ్రహ్మజ్ఞానం మరియు మోక్షానికి మార్గంగా భావించబడుతుంది. తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ క్షేత్రానికి దగ్గరగా ఉండటం వల్ల, ఆలంపూర్ భక్తులకు కేవలం చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రం కూడా. అభిషేక జలం ఎటు పోతుందో తెలీకపోయినా, ఈ ఆలయ రహస్యం మాత్రం తరతరాలుగా భక్తుల నమ్మకాన్ని, ఆసక్తిని మరింత పెంచుతూనే ఉంది.




One Comment