IND vs NZ : ఆరంభం అదరాల్సిందే.. కివీస్ తో భారత్ తొలి వన్డే
IND vs NZ: కివీస్ తో వన్డే సిరీస్ కు ముందు దాదాపు అందరూ ఫామ్ అందుకున్నట్టే కనిపిస్తున్నారు
IND vs NZ
భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ (IND vs NZ) కు అంతా సిద్ధమైంది. సౌతాఫ్రికా సిరీస్ తర్వాత కొన్ని రోజులు రిలాక్సయిన భారత క్రికెటర్లు విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగారు. కివీస్ తో వన్డే సిరీస్ కు ముందు దాదాపు అందరూ ఫామ్ అందుకున్నట్టే కనిపిస్తున్నారు. కోహ్లీ, రోహిత్ , గిల్ , పంత్ , రాహుల్ , శ్రేయాస్ అయ్యర్ ఇలా ప్రస్తుత సిరీస్ లో ఉన్నవారంతా విజయ్ హజారే ట్రోఫీలో కనీసం 2 మ్యాచ్ లు ఆడారు. ఈ వన్డే సిరీస్ కోసం మూడు రోజుల ముందే వడోదరకు చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేసిన టీమిండియా సీనియర్లపైనే ఇప్పుడు అందరి చూపు ఉంది.
ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రోకో జోడీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ , ఇటీవల సౌతాఫ్రికా సిరీస్ లోనూ అదరగొట్టిన వీరిద్దరూ విజయ్ హజారే ట్రోఫీలోనూ దుమ్మురేపారు. దీంతో రోకో జోడీ తమ ఫామ్ కొనసాగిస్తారని భావిస్తున్నారు.
అటు ఆసీస్ టూర్ గాయపడి ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ పైనా అంచనాలున్నాయి. వన్డేల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందు శ్రేయాస్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు. టీ ట్వంటీ తరహా హిట్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆడడంతో వన్డే సిరీస్ కు క్లియరెన్స్ దక్కింది. ఇదిలా ఉంటే ఈ సిరీస్ భారత కెప్టెన్ శుభమన్ గిల్ కు కూడా అగ్నిపరీక్షగా మారింది. పేలవ ఫామ్ తో సతమతమవుతున్న గిల్ విజయ్ హజారేలోనూ నిరాశపరిచాడు. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన గిల్ తాను వ్యక్తిగతంగా ఫామ్ అందుకోవడం చాలా కీలకమనే చెప్పాలి.
ఇక భారత జట్టు కూర్పులో కేఎల్ రాహుల్ కు వికెట్ కీపింగ్ బాధ్యతలు ఖాయం. గత కొంతకాలంగా వికెట్ల వెనుక , బ్యాట్ తోనూ అద్భుతంగా రాణిస్తున్న రాహుల్ నే కీపర్ గా కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. అలాగే ఆల్ రౌండర్ కోటాలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పోటీపడుతున్నారు. పిచ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వీరిద్దరిలో ఒకరికే చోటు దక్కుతుందని చెప్పొచ్చు.

వరుస అవకాశాలు ఇస్తున్నా నితీశ్ రెడ్డి సద్వినియోగం చేసుకోవడం లేదు. దీంతో ఈ (IND vs NZ) సిరీస్ అతనికి కూడా కీలకమని భావిస్తున్నారు. స్పిన్ విభాగంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు చోటు ఖాయం. పేస్ విభాగంలో బుమ్రా లేకపోవడంతో చోటు దక్కించుకున్న సిరాజ్ ఎలా రాణిస్తాడో చూడాలి. అలాగే అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.మరోవైపు మిఛెల్ బ్రేస్ వెల్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న న్యూజిలాండ్ కు ఆల్ రౌండర్ల కీలకం కాబోతున్నారు. కాన్వేతో పాటు డారిల్ మిఛెల్ , గ్లెన్ ఫిలిప్స్ పై అంచనాలున్నాయి.
బౌలింగ్ లో కైల్ జేమీసన్ తో పాటు భారత మూలాలున్న ఆదిత్య అశోక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాడు. వన్డేల్లో ఇరు జట్లు ఇప్పటి వరకూ 120 మ్యాచ్ లలో తలపడితే భారత్ 62 సార్లు గెలిచింది. న్యూజిలాండ్ 50 మ్యాచ్ లలో గెలవగా.. ఏడు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఒక వన్డే టైగా ముగిసింది. వడోదర పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంచు ప్రభావం ఉండనుండడంతో ఛేజింగ్ జట్టుకు కలిసొస్తుందని భావిస్తున్నారు.
Greenland:గ్రీన్ల్యాండ్పై ట్రంప్ కన్ను.. ఇటాలియన్ ప్రధాని మెలోని స్ట్రాంగ్ కౌంటర్



