1st T20 : షేక్ ఆడించిన అభిషేక్..తొలి టీ ట్వంటీలో భారత్‌దే విజయం

1st T20 : అభిషేక్ శర్మ, రింకూ సింగ్ విధ్వంసం సృష్టించిన వేళ నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో విజయం సాధించింది

టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ కు చివరి రిహార్సల్ గా ఉన్న న్యూజిలాండ్ సిరీస్ ను భారత్ ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, రింకూ సింగ్ విధ్వంసం సృష్టించిన వేళ నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీ(1st T20) లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే భారత తుది జట్టులో మార్పులు జరిగాయి. హార్థిక్, బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా.. ఇషాన్ కిషన్ కు కూడా చోటు దక్కింది. సంజూ శాంసన్ (10), ఇషాన్ కిషన్ (8) పరుగులకే ఔటవడంగా పవర్ ప్లేలోనే 2 కీలక వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి జట్టు స్కోరును టాప్ గేర్ లో నడిపించాడు. గత ఏడాది కాలంగా అద్భుతమైన ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతన్ని ఇన్నింగ్స్ ఫోర్ల కంటే సిక్సర్లే ఎక్కువగా ఉన్నాయి. వీరిద్దరూ మూడో వికెట్ కు 99 పరుగులు జోడించారు.

అటు సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా రోజుల తర్వాత టచ్ లోకి వచ్చాడు. 22 బంతుల్లో 32 (4 ఫోర్లు, 1సిక్స్) పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత హార్థిక్ పాండ్యా(25) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. అయితే దాదాపు ప్రతీ ఓవర్ కు రన్ రేట్ 12కు పైగా సాగడంతో భారత్ భారీస్కోరు సాధిస్తుందని అంచనా వేశారు. అయితే చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 220 లోపే ఇన్నింగ్స్ ముగుస్తుందనుకున్నారు. ఈ దశలో రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు.

భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. రింకూ కేవలం 20 బంతుల్లోనే 44 పరుగులు చేసాడు. ముఖ్యంగా మిచెల్ వేసిన చివరి ఓవర్లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతడు తన 4 ఓవర్ల స్పెల్ లో 27 పరుగులకు 2 వికెట్లు తీసాడు. కైల్ జేమీసన్ 2 వికెట్లు పడగొట్టాడు.

1st T20

239 పరుగుల భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. కాన్వే డకౌటవగా…వెంటనే రచిన్ రవీంద్ర కూడా వెనుదిరిగాడు. ఈ దశలో రాబిన్ సన్ , గ్లెన్ ఫిలిప్స్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 51 పరుగులు జోడించారు. రాబిన్ సన్ ఔటైన తర్వాత ఫిలిప్స్ , చాప్ మన్ కలిసి ఇన్నింగ్స్ నడిపించారు.

సాధించాల్సిన రన్ రేట్ చాలా ఎక్కువగా ఉండడంతో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫిలిప్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా..చాప్ మన్ 39 రన్స్ కు ఔటయ్యాడు. తర్వాత ఫిలిప్స్ 78 పరుగులకు ఔటైన వెంటనే డారిల్ మిచెల్, శాంట్నర్ దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. అప్పటికే కివీస్ ఓటమి ఖాయమైపోయింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, దూబే 2, అక్షర్ పటేల్, హార్థిక్ , అర్షదీప్ ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్ ల సిరీస్ ఫస్ట్ టీ ట్వంటీ(1st T20) లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో రెండో టీ20 గురువారం రాయ్ పూర్ లో జరుగుతుంది.

TTV Dhinakaran :టీటీవీ దినకరన్ రీ-ఎంట్రీతో ఎన్డీయేకు కొత్త ఊపు..తమిళనాడు రాజకీయాల్లో భారీ మలుపు

Exit mobile version