Just SportsLatest News

T20: క్లీన్ స్వీప్ తో ముగిస్తారా.. లంకతో చివరి టీ20కి భారత్ రెడీ

T20: షెఫాలీకి తోడు గత మ్యాచ్ లో స్మృతి మంధాన కూడా ఫామ్ లోకి వచ్చేసింది. భారీ షాట్లతో అభిమానులను అలరిస్తూ పలు రికార్డులను కూడా అందుకుంది.

T20

సొంతగడ్డపై జైత్రయాత్ర కొనసాగిస్తూ శ్రీలంకను నాలుగు టీ ట్వంటీ(T20)ల్లోనూ చిత్తు చేసిన భారత మహిళల జట్టు చివరి మ్యాచ్ కు రెడీ అయింది. ఈ ఏడాది వరల్డ్ కప్ గెలిచి అదరగొట్టిన భారత్ ఇప్పుడు క్లీన్ స్వీప్ విజయంతో 2025ను ఘనంగా ముగించాలని ఉవ్విళ్ళూరుతోంది. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ లంకపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ వరుస విజయాలతో చెలరేగిపోతున్న భారత్ చివరి మ్యాచ్ లోనూ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. తొలి మూడు టీ20(T20)లతో పోలిస్తే నాలుగో మ్యాచ్ లో శ్రీలంక కాస్త పోటీ ఇవ్వగలిగింది.

అయితే సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ ను ఓడించాలంటే మాత్రం లంక అంచనాలకు మించి రాణించాల్సిందే. సీనియర్లతో ఆడినా , రిజర్వ్ బెంచ్ ప్లేయర్స్ కు అవకాశమిచ్చినా కూడా ప్రతీ ఒక్కరూ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా లేడీ సెహ్వాగ్ షెఫాలీ వర్మ దుమ్మురేపుతోంది. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తోంది.

షెఫాలీకి తోడు గత మ్యాచ్ లో స్మృతి మంధాన కూడా ఫామ్ లోకి వచ్చేసింది. భారీ షాట్లతో అభిమానులను అలరిస్తూ పలు రికార్డులను కూడా అందుకుంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ అయిన రిఛా ఘోష్ మెరుపులు భారత్ కు భారీస్కోరు అందించాయి. అయితే ఈ సిరీస్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వ్యక్తిగతంగా సత్తా చాటలేకపోయింది. చివరి టీట్వంటీ(T20)లోనైనా ఆమె ఫామ్ అందుకుంటుందేమో చూడాలి. ఇదిలా ఉంటే అనారోగ్యంతో నాలుగో మ్యాచ్ కు దూరమైన జెమీమా రోడ్రిగ్స్ చివరి టీ20(T20)లో ఆడడంపై ఇంకా క్లారిటీ లేదు.

T20
T20

జెమీమా కూడా మంచి ఫామ్ లో ఉండగా.. బౌలింగ్ లో పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. రేణుకా సింగ్ పేస్ ఎటాక్ ను లీడ్ చేస్తుండగా.. అరుంధతి రెడ్డి కూడా సత్తా చాటుతోంది. స్పిన్ విభాగంలో ఎప్పటిలాగే దీప్తి శర్మ మ్యాజిక్ చేస్తుంటే.. యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ కూడా అదరగొడుతోంది. అరంగేట్రం నుంచే ఆకట్టుకుంటున్న వైష్ణవి మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటోంది. కాగా ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో చివరి మ్యాచ్ కు సంబంధించి తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. రిజర్వ్ బెంచ్ ప్లేయర్స్ లో కమిలిని తప్ప అందరికీ చోటు దక్కింది. దీంతో చివరి మ్యాచ్ లో ఆమె అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే శ్రీలంక మహిళల జట్టు నాలుగో టీ20(T20)లో మాత్రం ఆకట్టుకుంది. భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగానే ఆడి చివరి వరకూ పోరాడింది. ఓపెనర్ హాసినితో పాటు కెప్టెన్ ఆటపట్టు మంచి ఆరంభాన్నే ఇచ్చినా మిగిలిన బ్యాటర్లకు భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. దీంతో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఆ సిరీస్ లో లంక బౌలర్లు రాణిస్తున్నా.. బ్యాటర్లు మాత్రం విఫలమవుతుండడం వారికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో బ్యాటర్లు గాడిన పడితే తప్ప భారత్ ను నిలువరించడం లంకకు అసాధ్యమే.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button