Kalvakuntla Kavitha
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతా ఊహించినట్టుగానే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత (Kalvakuntla Kavitha ) పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. తనకు సెంటిమెంట్లు ఎక్కవని చెప్పిన కవిత మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. మంచి ముహూర్తం చూసి పార్టీని ప్రకటిస్తానని, తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
ప్రజలే తనను నాయకురాలిగా తీర్చిదిద్దాలని కోరారు. తన రాజకీయ భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందంటూ కల్వకంట్ల కవిత (Kalvakuntla Kavitha ) చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మరోసారి బీఆర్ఎస్ పై ఆమె విమర్శలు గుప్పించారు. తండ్రి కేసీఆర్ ను విమర్శించని కవిత తన అన్న కేటీఆర్ , మరో కీలక నేత హరీశ్ రావులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటఆర్, హరీశ్ రావు ఎందుకు ప్రచారానికి రావడం లేదని కవిత ప్రశ్నించారు. జాగృతి సంస్థ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనే ఎందుకు తిరుగుతున్నారని నిలదీశారు.
ముఖ్యంగా కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికే ఎందుకు పరిమితమయ్యారో చెప్పాలని ప్రశ్నించారు. గుంటనక్క, గూడాఛారి అంటూ తాను చేసిన విమర్శలను కవిత సమర్థించుకున్నారు. వారికి ఆ పదాలు సరిగ్గా సరిపోతాయనీ, అందుకే అలా పిలుస్తున్నట్టు చెప్పారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఎందుకు చూస్తూ ఊరుకోవాలని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు కాంగ్రెస్ పార్టీపైనా కవిత విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్న కవిత , తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్ర చెరిగిపోయేది కాదన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పోరాటం గురించి ప్రజలకు తెలుసన్నారు. తనకు రాజకీయ వ్యూహం లేదంటూ వస్తున్న విమర్శలను కవిత తిప్పికొట్టారు.
రానున్న రోజుల్లో తన పొలిటికల్ స్ట్రాటజీ ఏంటో అందరూ చూస్తారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలవుతుందన్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో కవిత టార్గెట్ బీఆర్ఎస్ గానే ఉండబోతుందన్న విషయం తాజా కామెంట్స్ తేలిపోయింది. కాంగ్రెస్ ను పెద్దగా విమర్శించని కవిత హరీశ్ రావు, కేటీఆర్ లపై మాత్రం విరుచుపడుతున్నారు.
