130th Constitutional Amendment Bill
దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025పై.. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కీలక మార్పులను తీసుకుని వచ్చింది. బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి అధ్యక్షతన ఏర్పడిన ఈ 31 మంది సభ్యుల కమిటీ విపక్షాలు.. చట్టపరమైన వర్గాల నుంచి వచ్చిన అబ్జెక్షన్స్ పరిశీలించి బ్యాలెన్స్డ్ సిఫార్సులను రెడీ చేసింది.
తీవ్రమైన నేరారోపణలపై అరెస్ట్ అవడంతో పాటు వరుసగా 30 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను డైరెక్టుగా పదవి నుంచి తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కమిటీ అభిప్రాయపడింది.
కోర్టులో నేరం నిరూపణ అవక ముందే ఇలా పూర్తి తొలగింపునకు వెళ్తే అది ఆ వ్యక్తిపై మునుపే నింద మోపినట్లు అవుతుందని, అందుకే తొలగింపునకు బదులు టెంపరరీ సస్పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని డ్రాఫ్ట్ నివేదికలో స్పష్టం చేసింది. వివాదాస్పదంగా మారిన ఈ బిల్లుపై ఫైనల్ డెసిషన్ కోసం జూలై 17న జేపీసీ సమావేశమై కేంద్రానికి తుది నివేదిక అందించనుంది.
అసలేంటి ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు(130th Constitutional Amendment Bill) అంటే.. కేంద్ర ప్రభుత్వం గతేడాది లోక్సభలో ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు(130th Constitutional Amendment Bill)ను ప్రవేశపెట్టింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, జైలుకు వెళ్లిన తర్వాత కూడా పదవుల్లో కొనసాగుతూ జైలు నుంచే పాలనను సాగించడం అనే ధోరణికి అడ్డుకట్ట వేయడమే.
ఈ బిల్లు ప్రకారం.. తీవ్ర నేరాలలో అరెస్ట్ అయ్యి, 30 రోజుల పాటు జైలులో ఉంటూ బెయిల్ రాని పీఎం, సీఎం లేదా మంత్రులు ఆటోమేటిక్గా తమ పదవులను కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఈ నిబంధన వల్ల కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను అస్త్రాలుగా వాడుకుని.. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే డేంజర్ ఉందని విపక్షాలు మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అరెస్ట్ అనేది కేవలం విచారణలో భాగమే తప్ప కోర్టు ఇచ్చే శిక్ష కాదనే వాదనలు వినిపించడంతో.. బిల్లును సమగ్ర పరిశీలన కోసం జేపీసీకి పంపారు.
ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న జేపీసీ, పొలిటికల్ కక్షసాధింపులకు చెక్ పెట్టేలా ఐదు ముఖ్యమైన సవరణలను సూచించింది. 30 రోజుల జైలు కాలం దాటిన ప్రజాప్రతినిధులెవరైనా సరే విధులకు దూరం కావాల్సిందే కానీ, అది కేవలం టెంపరరీ సస్పెన్షన్ రూపంలోనే ఉండాలి.
ఒకవేళ ఆ నేత కోర్టు ద్వారా నిర్దోషిగా రుజువైనా, కేసు వీగిపోయినా, లేదా అనుకున్న గడువులోగా ప్రాసిక్యూషన్ విచారణను ముందుకు తీసుకెళ్లలేకపోయినా ఆ సస్పెన్షన్ ఆటోమేటిక్గా రద్దవడంతో పాటు, మళ్లీ వారికి పాత పదవి దక్కేలా ఆటోమేటిక్ రివర్సల్ క్లాజ్ను ప్రతిపాదించారు.
అలాగే ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న వాటిని మాత్రం తీవ్రమైన నేరాలుగా పరిగణించాలని, ఆ చట్టం వర్తించే నిర్దిష్ట నేరాల లిస్టుతో ఒక స్పెషల్ షెడ్యూల్ను బిల్లులో చేర్చాలని స్పష్టం చేసింది.
దీంతో పాటు ఉన్నత పదవుల్లో ఉన్నవారి కేసులను వేగంగా తేల్చడానికి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కూడా సిఫార్సు చేసింది.
ఈ నెల జూలై 20 నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో.. ఈ జేపీసీ నివేదిక సభ ముందుకు రాబోతోంది. కేంద్రం ఈ మార్పులను పరిశీలించి ఇదే సెషన్లో ఆమోదించే ఛాన్స్ ఉంది.
Bhringraj : హెయిర్ ఫాల్ తగ్గి.. కొత్త జుట్టు పెరగాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి!
