Ranji Trophy : చరిత్ర సృష్టించిన జమ్మూకశ్మీర్..తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
Ranji Trophy : ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి నిలకడగా రాణిస్తూ, పెద్ద జట్లకు షాకిస్తూ తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ కైవసం చేసుకున్న జట్టుగా జమ్ము కశ్మీర్ చరిత్ర సృష్టించింది
Ranji Trophy
భారత దేశవాళీ క్రికెట్ లో సరికొత్త శకం మొదలైంది. డొమెస్టిక్ క్రికెట్ లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ అనగానే ముంబై, కర్ణాటక, బెంగాల్ , ఢిల్లీ వంటి జట్లే టైటిల్ ఫేవరెట్లుగా కనిపిస్తుంటాయి. ఇదంతా మొన్నటి వరకూ మాత్రమే.. ఇప్పుడు కథ మారింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి నిలకడగా రాణిస్తూ, పెద్ద జట్లకు షాకిస్తూ తొలిసారి రంజీ ట్రోఫీ(Ranji Trophy) టైటిల్ కైవసం చేసుకున్న జట్టుగా జమ్ము కశ్మీర్(Jammu and Kashmir) చరిత్ర సృష్టించింది.
ఇది జమ్మూ రాష్ట్రానికి ఒక గొప్ప విజయంగానే చెప్పాలి. ఎందుకంటే తుపాకీ మోతలతో, సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలతో నిత్యం టెన్షన్ టెన్షన్ గా ఉండే జమ్మూ కశ్మీర్ ఇలాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఛాంపియన్ గా నిలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అయితే ఇండియాలో క్రికెట్ టాలెంట్ కు కొదవ లేదన్నది ఈ విజయంతో మరోసారి రుజువైంది. గత కొంతకాలంగా జమ్మూ కశ్మీర్ జట్టు రంజీల్లోనే కాదు దేశవాళీ క్రికెట్ లో పలు అద్భుత విజయాలు సాధిస్తోంది.
దీనిలో భాగంగానే రంజీ సీజన్ లోనూ అదరగొట్టింది. పెద్ద పెద్ద జట్లను నిలువరిస్తూ ఫైనల్ కు దూసుకొచ్చిన జమ్మూ కశ్మీర్ తమ విజయాలు గాలివాటం కాదని నిరూపించింది. ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ కర్ణాటకపై పూర్తి ఆధిపత్యం కనబరిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జమ్మూ కశ్మీర్ భారీ స్కోరే లక్ష్యంగా ఆడింది. కీలక బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. కెప్టెన్ పారస్ డోగ్రా, యావర్ హసన్ , అబ్దుల్ సమద్ , కన్హయ్య వాధవాన్ , సాహిల్ లోట్రా హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక శుభం పండిర్ సెంచరీతో చెలరేగడంతో భారీస్కోరు చేయగలిగింది.

కేవలం బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ జమ్మూ సత్తా చాటింది. టాప్ క్లాస్ బ్యాటర్లున్న కర్ణాటకను 293 పరుగులకే ఆలౌట్ చేసింది. కేఎల్ రాహుల్ లాంటి బ్యాటర్ ను త్వరగానే ఔట్ చేయడం కలిసొచ్చింది. అయితే సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్కాల్ భారీ శతకంతో రాణించినా మిగిలిన వారి నుంచి సహకారం లభించలేదు. జమ్మూకశ్మీర్ విజయంలో ఆకిబ్ నబీ కీలక పాత్ర పోషించాడు.
తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో కర్ణాటకను దెబ్బకొట్టాడు. 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జమ్మూ నాలుగోరోజు ముగిసేసరికే 477 పరుగులకు ఆధిక్యాన్ని పెంచుకుంది. చివరి రోజు కమ్రాన్ సాహిల్ లోట్రా సెంచరీలు చేసిన తర్వాత డిక్లేర్ ను ప్రకటించింది. రంజీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఫలితం తేలకుంటే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు.
దీంతో తొలిసారి రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ చివరిరోజు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రత్యేకంగా హాజరై విజేతగా నిలిచిన తమ జట్టును అభినందించారు.



