Just SportsLatest News

Suryakumar Yadav : సూర్యాభాయ్ కెప్టెన్ ఇన్నింగ్స్..వరల్జ్ కప్ లో భారత్ బోణీ

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్ ఆడి కేవలం 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. యూఎస్ఏ బౌలర్లలో షాడ్లీ 4 వికెట్లు పడగొట్టాడు

Suryakumar Yadav

డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టీ20 ప్రపంచకప్ లో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో యూఎస్ఏను చిత్తు చేసింది. బ్యాటింగ్ లో తడబడినా సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. అటు బౌలింగ్ లో సిరాజ్ , అక్షర్ పటేల్ రాణించడంతో భారత్ గెలుపుతో టోర్నీని ఘనంగా ఆరంభించింది.

ఈ మ్యాచ్ లో భారత్ తుది జట్టులో కీలక మార్పులు జరిగాయి. ఊహించినట్టుగానే ఓపెనర్ సంజూ శాంసన్ ను పక్కన పెట్టేశారు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అలాగే బుమ్రా జ్వరంతో బాధపడుతుండడంతో రెస్ట్ ఇచ్చారు. హర్షిత్ రాణా స్థానంలో ఎంపికైన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆటోమేటిక్ గా తుది జట్టులోకి వచ్చాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు యూఎస్ఏ బౌలర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. విధ్వంసం సృష్టిస్తారనుకున్న భారత్ ను ఆరంభం నుంచే వికెట్లు తీసి దెబ్బకొట్టారు. అభిషేక్ శర్మ(0) డకౌటవగా… ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన ఇషాన్ కిషన్‌ 20 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో తిలక్ వర్మ(25) కూడా పెవిలియన్ చేరాడు. ఈ మూడు వికెట్లను అమెరికా ప్రైమ్ బౌలర్ షాడ్లీ పడగొట్టాడు. అటు బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ దక్కించుకున్న శివమ్ దూబే కూడా డకౌటయ్యాడు.

దీంతో భారత జట్టు పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయి 46 పరుగులే చేసింది. ఈ దశలో సింగిల్స్ వస్తే చాలు.. వికెట్ పడకుంటే చాలు అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) కాస్త ఆచితూచి ఆడాడు.మరోవైపు రింకూ సింగ్, హార్థిక్ పాండ్యా కూడా నిరాశపరచడంతో మరో 2 వికెట్లు చేజారిపోయాయి.

Suryakumar Yadav
Suryakumar Yadav

దాంతో టీమిండియా 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఒక దశలో కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. అయితేకెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. అక్షర్ పటేల్ కలిసి 41 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్ ఔటైనప్పటకీ.. మిగిలిన టెయిలెండర్లతో కలిసి సూర్యకుమార్ యాదవ్ స్కోరు పెంచాడు. భారీ షాట్లతో చెలరేగిపోయాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది.

సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అద్భుతమైన బ్యాటింగ్ ఆడి కేవలం 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. యూఎస్ఏ బౌలర్లలో షాడ్లీ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్ లో యూఎస్ఏ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అనుభవజ్ఞులైన భారత బౌలర్ల ముందు తోక ముడిచారు. సిరాజ్ , అర్షదీప్ సింగ్ పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీసి అమెరికా పతనాన్ని శాసించారు. మిలింద్ కుమార్ (34) , సంజయ్ (37), శుభమ్ (37) పరుగులతో రాణించగా.. మిగిలిన వారంతా చేతులెత్తేశారు. భారత బౌలర్లలో సిరాజ్ 3 , అర్షదీప్ 2 , అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ లో ఫిబ్రవరి 12న నమీబియాతో తలపడుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button