TDP :టీడీపీలో మరో గవర్నర్ పదవి వారికేనా?
TDP:ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.

TDP:ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. బీజేపీ అధినాయకత్వం(BJP high command) ఎన్డీఏను మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. వారి మిషన్ 2029 ఎజెండాలో భాగంగా కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు పెద్దపీట వేస్తున్నారు.
TDP
ఇప్పటికే టీడీపీ సీనియర్ అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమించడమే దీనికి నిదర్శనం. తాజాగా జరుగుతున్న చర్చల ప్రకారం, టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటు, కేంద్రంలో కీలక నియామకాల్లోనూ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీ(TDP)కి చెందిన మరో సీనియర్ లీడర్కు గవర్నర్ పదవి ( Governor post) ఖాయంగా కనిపిస్తోంది.
బీజేపీ అధినాయకత్వం ఎన్డీఏను విస్తరించే ప్రణాళికలో భాగంగా పార్ట్నర్స్కు ప్రాధాన్యత పెంచుతోంది. త్వరలో బీహార్, ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దీంతోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీడీపీకి ఇప్పటికే కేంద్ర క్యాబినెట్లో రెండు మంత్రి పదవులు దక్కాయి.
ఇప్పుడు అశోక్ గజపతి రాజు(Ashok Gajapathi Raju)ను గోవా గవర్నర్గా నియమించారు. 2014-2018 మధ్య ఎన్డీఏలో టీడీపీ ఉన్నప్పుడు కూడా గవర్నర్ పదవిపై హామీ లభించింది కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఈసారి మాత్రం మొదటి ఏడాదే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో, టీడీపీకి ప్రాధాన్యతను పెంచుతూ మరో గవర్నర్ పదవిపై హామీ లభించినట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
మరో గవర్నర్ పదవి ఎవరికి..?
టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కడం ఖాయం కాగా, దీనిని చంద్రబాబు ఎవరికి కట్టబెడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఖరారైనప్పుడు అనేక సానుకూల అంశాలు కలిసొచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు కావడంతో పాటు, ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. అలాగే, ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత క్యాబినెట్లో అవకాశం దక్కలేదు.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడిగా అశోక్ గజపతి రాజు గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, రెండో గవర్నర్ పదవి బీసీ – ఎస్సీ వర్గాల నుంచి ఎవరికి అనే చర్చ జరుగుతోంది. సీనియర్ నాయకుడు యనమల కూడా ఈ రేసులో ఉన్నా, ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో, రెండో గవర్నర్ పదవి రాయలసీమకు చెందిన బీసీ నేతకు దక్కుతుందని వాదనలు వినిపిస్తున్నాయి.
రాయలసీమ నుంచి చంద్రబాబుతో కలిసి గతంలో కాంగ్రెస్లో పని చేసి, ఆ తర్వాత టీడీపీలో అనేక కీలక పదవులు నిర్వహించిన కేఈ కృష్ణమూర్తి( KE Krishnamurthy) పేరు తెరపైకి వచ్చింది. అయితే, కేఈ కుమారుడికి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చారు, పత్తికొండ నుంచి గెలుపొందారు.
ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తి రాజకీయంగా అంతగా చురుకుగా లేరు. 2014-19 కాలంలో డిప్యూటీ సీఎం హోదాలో కేఈ పనిచేశారు. దీంతో, ఈసారి గవర్నర్ పదవిని బీసీ వర్గానికి ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. అంతేకాకుండా, జాతీయ స్థాయిలో కీలక నియామకాల్లోనూ టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ నాయకులకు అవకాశం దక్కనుండటంతో.. టీడీపీ నుంచి జాబితా కోరినట్లు ఢిల్లీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.