Municipal Elections: క్లైమాక్స్కు వచ్చేసిన తెలంగాణ మున్సిపల్ పోరు.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరికి ప్లస్?
Municipal Elections: మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, బరిలో ఉన్న అభ్యర్థులెవరో తేలిపోయింది.
Municipal Elections
తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న జరగబోతున్న ఎన్నికలు (Municipal Elections) రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఫిబ్రవరి 3 మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, బరిలో ఉన్న అభ్యర్థులెవరో తేలిపోయింది. ఫిబ్రవరి 13న వెలువడబోతున్న ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ వంటివని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీల వ్యూహాలు – గెలుపు అవకాశాలను ఒకసారి చూసుకుంటే..
కాంగ్రెస్- అధికార పార్టీగా ఉన్న అడ్వాంటేజ్ను..రేవంత్ సర్కార్ వాడుకోవాలని చూస్తోంది. సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలే తమను గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పట్టు సాధించడం ద్వారా తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిరూపించుకోవాలని భావిస్తోంది.
బీఆర్ఎస్- గత ఎన్నికల్లో మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. ఇప్పుడు ఆ పట్టును నిలబెట్టుకోవడానికి కేసీఆర్ అండ్ టీమ్ కు వర్కవుట్ చేస్తున్నారు. పట్టణాల్లో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తూ ఓట్లు అడుగుతున్నారు.
బీజేపీ- లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. పట్టణ ఓటర్లు ఎప్పుడూ తమవైపే ఉంటారని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా నగరాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయాలని ప్లాన్ చేస్తోంది.
అయితే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఇది బీఆర్ఎస్ కి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అన్న చర్చ మొదలయింది.
బీఆర్ఎస్కు మైనస్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ అధికారుల అరెస్టులు, బయటకు వస్తున్న వివరాలన్నీ కూడా బీఆర్ఎస్ ఇమేజ్ను దెబ్బతీసేవిగా కనిపిస్తున్నాయి.
అధికార పక్షం, బీజేపీ నేతలు దీనినే ప్రధాన అస్త్రంగా వాడుతున్నాయి. తమ ప్రైవసీని దెబ్బతీశారనే కోపం.. పట్టణ విద్యావంతుల్లో బీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచే ప్రమాదం కూడా ఉంది.
అయితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే మాత్రం అది సానుభూతిగా మారే అవకాశం కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతానికయితే ఇది బీఆర్ఎస్ కు ఒక పెద్ద ప్రతిబంధకమే అని చెప్పొచ్చు.
మరోవైపు చాలా కాలం తర్వాత మళ్లీ బ్యాలెట్ పద్ధతిలోనే ఈ మున్సిపల్ ఎన్నికలు(Municipal Elections) జరగడం విశేషం. ఈవీఎంల కంటే బ్యాలెట్ పద్ధతి వల్ల కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశమున్నా, పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. 52 లక్షల మంది ఓటర్ల తీర్పు ఈ మూడు పార్టీల భవిష్యత్తును ఇప్పుడు నిర్ణయించబోతోంది.

ఈసారి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల (ULBs) పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తం 2,996 వార్డుల్లో అంటే మున్సిపాలిటీల్లో 2,582, కార్పొరేషన్లలో 414 వార్డుల్లో ఈ పోరు సాగనుంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో సుమారు 26.80 లక్షలతో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం.
మొత్తంగా తిరుగుబాటు అభ్యర్థులు (Rebels) పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలాగా కనిపిస్తున్నారు. బుజ్జగింపులు ఫలించని చోట త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఫిబ్రవరి 13న వెలువడే వీటి ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయనే చెప్పొచ్చు.
February 14th: మనసు గెలిచే వేడుక వచ్చేస్తోంది.. ప్రేమ కానుకలివే..




One Comment