Chennai Super Kings : చెన్నై మ్యాచ్ లకు భారీ వ్యూయర్ షిప్..ధోనీ లేకున్నా తగ్గని క్రేజ్
Chennai Super Kings : సీఎస్కే మ్యాచ్ లను సగటున 308 మిలియన్ల మంది చూస్తున్నారు.
Chennai Super Kings
ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఒకటిరెండు జట్లు మినహా మిగిలిన టీమ్స్ ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. ఫస్టాఫ్ లో చతికిలపడిన టీమ్స్ ఇప్పుడు సెకండాఫ్ కు వచ్చేసరికి దుమ్మురేపుతున్నాయి. మొన్నటి వరకూ టాప్ 4లో ఉన్న జట్లను టెన్షన్ పెడుతూ చెన్నై , కోల్ కతా వంటి జట్లు ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చాయి.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ ముగిసేవరకూ ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఈ సీజన్ ఆరంభంలో కొన్ని మ్యాచ్ లు చప్పగా సాగినా క్రమంగా ఊపొచ్చింది. ఈ నేపథ్యంలో వ్యూయర్ షిప్ కు సంబంధించి ఆసక్తికర గణాంకాలు బయటకొచ్చాయి. ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లకు సంబంధించి వ్యూస్, ఇతర వివరాలతో నివేదికను విడుదల చేసింది. మే 1 వరకు జరిగిన మ్యాచ్ల టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ డేటా లెక్కలను వెల్లడించింది.
దీని ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఆడే మ్యాచ్ లను ప్రేక్షకులు అత్యధిక సంఖ్యలో వీక్షించినట్టు వెల్లడైంది. సీఎస్కే(CSK) మ్యాచ్ లను సగటున 308 మిలియన్ల మంది చూస్తున్నారు. చెన్నై మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా కూడా ఆ జట్టు మ్యాచ్ లకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గతంతో పోలిస్తే ఇంకా భారీగా వ్యూయర్ షిప్ పెరిగిందని నివేదిక ద్వారా తెలుస్తోంది.
ఈ జాబితాలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ మ్యాచ్ లను సగటున 300 మిలియన్ల మంది వీక్షిస్తున్నారు. అలాగే మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నా ఆ జట్టు క్రేజ్ కూడా తగ్గలేదు. ముంబై మ్యాచ్ లను సగటున 293 మిలియన్ల మంది వీక్షించినట్టు వెల్లడైంది.

అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లకు 290 మిలియన్ల మంది, కోల్ కతా నైట్ రైడర్స్ కు 280 మిలియన్ల మందితో వ్యూయర్ షిప్ లభించింది. కాగా ఈ సీజన్ ఆరంభంలో చెన్నై అట్టర్ ఫ్లాప్ అయింది. ధోనీతో సహా కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవడం, అంచనాలు పెట్టుకున్న ప్లేయర్స్ ఫెయిలవడంతో వరుస పరాజయాలు ఎదుర్కొంది.
అయితే అనూహ్యంగా సీజన్ సెకండాఫ్ లో సీఎస్కే(Chennai Super Kings) అద్భుతమైన ఆటతీరుతో పుంజుకుంది. సంజూ శాంసన్ , కార్తీక్ శర్మ వంటి ఆటగాళ్లు బ్యాటింగ్ లోనూ, ఓవర్టన్, అకిల్ హొస్సేన్ , అన్షుల్ కాంబోజ్ వంటి స్పిన్నర్లు బౌలింగ్ లోనూ అదరగొడుతున్నారు. ఫలితంగా చెన్నై ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది.





