Vijay Government : విజయ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్..కరూర్ బాదితుల ఉద్యోగాల రద్దు నిర్ణయంపై స్టే
Vijay Government : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ కరూర్ బాధిత కుటుంబాలను పరామర్శించి.. ఒక్కో కుటుంబంలో విద్యార్హత ప్రకారం ఒక్కొక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచారు.
Vijay Government
కరూర్ తొక్కిసలాట ఘటన బాధితుల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తమిళనాడు విజయ్ సర్కారు(Vijay Government)కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కరూర్ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సరికాదంటూ ఆ ఉత్తర్వులు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై.. దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.
కరూర్లో గతేడాది సెప్టెంబర్ 27న టీవీకే అధినేత విజయ్ రాజకీయ ప్రచార సభలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. వంద మందికి పైగా గాయపడ్డారు. దేశంలో అత్యంత విషాదకర ఘటనల్లో ఇది ఒకటిగా నిలిచింది.
ఈ ఘటనకు సంబంధించి టీవీకే అధినేత విజయ్తో పాటు ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలపై కేసు కూడా నమోదు చేశారు. తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ విజయం సాధించడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ కరూర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. అలాగే ఒక్కో కుటుంబంలో విద్యార్హత ప్రకారం ఒక్కొక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచారు. దీనికి సంబంధించి నియామక పత్రాలు కూడా అందజేశారు.
అయితే విజయ్ ప్రభుత్వం(Vijay Government) తీసుకున్న నిర్ణయంపై కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వారి నియామకాలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. విచారించిన హైకోర్టు విజయ్ ప్రభుత్వం ఇచ్చిన నియామక పత్రాలను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోమంది విద్యార్థులు పోటీ పడుతున్నారని, రాజకీయ సభల్లో దురదృష్టవశాత్తూ చనిపోయిన వారికి అవి ఇవ్వడం సరికాదని పేర్కొంది.
ఇప్పటికే వివిధ శాఖల్లో కారుణ్య నియామకాల కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారని, వారిని కాదని ఈ ఘటన బాధితులకు ఉద్యోగాలు ఇవ్వడం సరికాదని పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ విజయ్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తే దానిని అడ్డుకోవడంలో హైకోర్టుకు ఉన్న అభ్యంతరం ఏమిటో చెప్పాలన్నారు. ఈ వాదనలతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది.
తొక్కిసలాట జరిగి ప్రజలు చనిపోయారనీ,. బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలవడానికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే తప్పేంటని ప్రశ్నించింది. కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి చనిపోతే, వారి కుమారుడికి లేదా కుమార్తెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగాలను పంపిణీ చేసే విచక్షణాధికారం ప్రభుత్వానికి లేదన్న వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.





