Team India : మళ్లీ మళ్లీ అవే తప్పులు..పాఠాలు నేర్వని టీమిండియా
Team India : ఏ ఫార్మాట్ లోనైనా పరిస్థితులకు తగ్గట్టు ఆడడం కీలకం. అందులోనూ పొట్టి క్రికెట్ లో దూకుడు ఉండాల్సిందే. అలాగని పరిస్థితులను దృష్టిలో ఉంచుకోకుంటే పరాజయాలు తప్పవు.
Team India
టీ20 ఫార్మాట్ లో విశ్వవిజేతలుగా, నెంబర్ 1 జట్టుగా ఉన్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు పేలవ ప్రదర్శనలతో నిరాశ పరుస్తోంది. టీ20 ప్రపంచకప్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా(Team India) ఒక్కసారిగా ఇలాంటి ప్రదర్శనలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
ముఖ్యంగా ఐర్లాండ్ తో సిరీస్ ఓడిపోయిన తర్వాత ఆ తప్పిదాల నుంచి ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదు. ఏ ఫార్మాట్ లోనైనా పరిస్థితులకు తగ్గట్టు ఆడడం కీలకం. అందులోనూ పొట్టి క్రికెట్ లో దూకుడు ఉండాల్సిందే. అలాగని పరిస్థితులను దృష్టిలో ఉంచుకోకుంటే పరాజయాలు తప్పవు.
ఐర్లాండ్ గడ్డపై, ఇప్పుడు ఇంగ్లాండ్ తో మొదటి టీ20లో ఓటములకు కారణాలను విశ్లేషిస్తున్నారు, ప్రధానంగా ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, కీలక సమయాల్లో బ్యాటింగ్ ప్రదర్శన సరిగ్గా లేకపోవడం, విదేశీ పిచ్లపై కొత్త పరిస్థితులకు త్వరగా అలవాటు పడలేకపోవడం వంటివి వైఫల్యాలకు కారణాలుగా భావిస్తున్నారు
కీలకమైన మ్యాచ్లలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం , ఇంకా ఒత్తిడిని అధిగమించడంలో వైఫల్యం జట్టును దెబ్బతీస్తోంది.ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలను అర్థం చేసుకోవడంలో లేదా పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ శైలిని మార్చుకోవడంలో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు.
పవర్ ప్లేలో భారీ స్కోరు సాధించలేకపోవడం, అలాగే ఓపెనర్లు త్వరగా అవుట్ కావడం వల్ల మిడిల్ ఆర్డర్పై భారం పడుతోంది.డెత్ ఓవర్లలో ధాటిగా ఆడలేకపోవడం అదే సమయంలో వికెట్లు కోల్పోతుండడంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాలను ఉంచలేకపోతోంది. అలాగే స్వదేశంలో ఆడినంత దూకుడుగా భారత బ్యాటర్లు , బౌలర్లు విదేశీ పిచ్లపై మాత్రం తేలిపోతున్నారు. ముఖ్యంగా బౌన్స్, పేస్ ఎక్కువగా ఉన్న చోట క్రీజులో నిలవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఇక బౌలింగ్ లోనూ అంతే. కీలక సమయాల్లో వికెట్లు తీయలేకపోవడం , భారీగా పరుగులను సమర్పించుకోవడం కూడా ఒక ప్రధాన కారణం. భవిష్యత్తు కోసం అని బోర్డు తరచుగా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం, జట్లలో మార్పులు చేయడం వల్ల కొన్నిసార్లు నిలకడ లోపిస్తోంది.

సీనియర్ ఆటగాళ్ల విశ్రాంతి సమయంలో వచ్చిన కొత్త కుర్రాళ్ళు అంతర్జాతీయ మ్యాచుల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. కెప్టెన్సీ మార్పు కూడా ప్రభావం చూపినట్టే కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ ను తప్పించి శ్రేయాస్ అయ్యర్ కు టీ20 జట్టు పగ్గాలను అప్పగించారు.
ఐపీఎల్ లో జట్టును సమర్థవంతంగా నడిపించినా అంతర్జాతీయ క్రికెట్ కి వచ్చేసరికి తేలిపోయాడు. ఇకనైనా సిరీస్ లో మిగిలిన మ్యాచ్ లలో గెలుపు బాట పట్టకుంటే మాత్రం శ్రేయాస్ తీవ్ర విమర్శల సుడిగుండంలో చిక్కుకోవడం ఖాయమని చెప్పొచ్చు.
Mojtaba : కొనసాగుతున్న ఖమేనీ అంత్యక్రియలు..మరి సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ?





