Tollywood strike: టాలీవుడ్ సమ్మెకు ఎండ్ కార్డ్ ?
Tollywood strike: జీతాలు పెంచాలని కార్మికులు ఆందోళనకు దిగడంతో నిలిచిపోయిన షూటింగ్లు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి

Tollywood strike
టాలీవుడ్లో గత రెండు వారాలుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె(Tollywood strike)కు త్వరలో తెరపడనుందా? జీతాలు పెంచాలని కార్మికులు ఆందోళనకు దిగడంతో నిలిచిపోయిన షూటింగ్లు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ వివాదంలోకి అడుగుపెట్టడంతో ఆశలు చిగురిస్తున్నాయి.
సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో 15 రోజులుగా సమ్మె(Tollywood strike) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య పరిష్కారం కోసం నిర్మాతలతో పాటు, కార్మిక సంఘాల నేతలు కూడా చిరంజీవిని సంప్రదించారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి, ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ తో పాటు 24 క్రాఫ్ట్స్ నుంచి వచ్చిన 72 మంది ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ, తమ వేతనాల పెంపు కోసం జరుగుతున్న సమ్మె(Tollywood strike) వివరాలను చిరంజీవికి వివరించామని చెప్పారు. నిర్మాతలు తమ మాట వినకుండా తమపైనే నిందలు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వేతనాల పెంపుతో పాటు, ఆదివారం డబుల్ కాల్ షీట్ వంటి తమ ప్రధాన డిమాండ్లను చిరంజీవి ముందు ఉంచామని తెలిపారు. ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు రమ్మని చిరంజీవి భరోసా ఇచ్చారని, తమకు అనుకూలంగానే వేతనాలు పెరుగుతాయని ఆశిస్తున్నామని అనిల్ కుమార్ పేర్కొన్నారు. చిరంజీవి లేదా బాలకృష్ణ లాంటి పెద్దలు ఎవరూ ఒకరి పక్షాన మాట్లాడరని, పరిశ్రమ బాగు కోసమే మాట్లాడుతారని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, నిర్మాత సి.కల్యాణ్ కూడా ఇప్పటికే చిరంజీవితో సమావేశమై సమస్యను ఆయన ముందుంచారు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్తో నిర్మాతల చర్చలు ముగిసిన అనంతరం, సి.కల్యాణ్ మాట్లాడుతూ, సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తామంతా కలిసి ఫిల్మ్ ఛాంబర్కు బాధ్యతను అప్పగించామని, ఛాంబర్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

రెండు వర్గాలతో మెగాస్టార్ చిరంజీవి విడివిడిగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి రేపటి సమావేశంపై పడింది. రేపు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య కీలక సమావేశం జరగనుంది.
Also Read: School fee: నర్సరీ ఫీజు రూ. 2.51 లక్షలేనట.. చదువు‘కొందాం’ రండి
ఈ సమావేశంలో చిరంజీవి సూచనలతో ఇరు వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పరిశ్రమ పెద్దగా చిరంజీవి ఒకరిని తగ్గమనో, మరొకరిని నెగ్గమనో కాకుండా, నిర్మాతల పెట్టుబడికి నష్టం కలగకుండా, అదే సమయంలో కార్మికులకు న్యాయమైన వేతనాలు లభించేలా ఒక మధ్యేమార్గం సూచించే అవకాశం ఉంది. ఈ సమావేశం విజయవంతమైతే, రెండు వారాలుగా నిలిచిపోయిన చిత్రాల చిత్రీకరణలు తిరిగి ప్రారంభమవుతాయి. తెలుగు సినీ పరిశ్రమ రేపటి కీలక సమావేశం వైపు ఆసక్తిగా చూస్తోంది.