K Bhagyaraj : 80ల నాటి స్క్రీన్ ప్లే రారాజు ఇక లేరు..ప్రముఖ నటుడు, క్లాసిక్ దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
K Bhagyaraj : మధ్యతరగతి కుటుంబాల జీవితాలు, వారి కష్టాలు, సగటు మనుషుల భావోద్వేగాలను వెండితెరపై చూపించడంలో భాగ్యరాజ్ రూటే వేరు అన్నట్లుగా సాగింది.
K Bhagyaraj
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తనదైన స్క్రీన్ ప్లే మాయాజాలంతో, వినూత్నమైన స్టోరీలతో 80, 90ల కాలంలో సినీ వరల్డ్ను ఊపేసిన ప్రముఖ తమిళ నటుడు, లెజెండరీ డైరెక్టర్, రచయిత కె.భాగ్యరాజ్(K Bhagyaraj) కన్నుమూశారు. చెన్నైలో శనివారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం భాగ్యరాజ్ వయసు 73 సంవత్సరాలు. ఆయన మరణవార్త వినగానే తమిళ సినీ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఒక అద్భుతమైన కథా రచయితను,మంచి నటుడిని కోల్పోయామంటూ సినీ లోకం కన్నీరు పెడుతుంది.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జన్మించిన కృష్ణస్వామి భాగ్యరాజ్ సినీ ప్రస్థానం చాలా వేగంగా జరిగింది. ప్రముఖ అగ్ర దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన భాగ్యరాజ్ ..సినిమా నిర్మాణంలోని మెళకువలను ఈజీగానే నేర్చుకున్నారు.
ఆ తర్వాత మెగాఫోన్ పట్టడం మాత్రమే కాదు.. తానే కథ రాస్తూ, తానే హీరోగా యాక్ట్ చేస్తూ అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. మెయిన్గా మధ్యతరగతి కుటుంబాల జీవితాలు, వారి కష్టాలు, సగటు మనుషుల భావోద్వేగాలను వెండితెరపై చూపించడంలో భాగ్యరాజ్ రూటే వేరు అన్నట్లుగా సాగింది. అందుకే ఆడియన్స్ ఆయనను స్క్రీన్ ప్లే రారాజుగా గుండెల్లో పెట్టుకున్నారు.
భాగ్యరాజ్ తన సుదీర్ఘ సినీ కెరీర్లో సుమారు 25కు పైగా చిత్రాలకు డైరెక్షన్ వహించడమే కాకుండా, 75కు పైగా సినిమాల్లో విలక్షణమైన నటుడిగానూ మెప్పించారు. సాధారణ మనుషుల మాటలు, హాస్యం, సామాజిక బాధ్యతను కూడా యాడ్ చేస్తూ ఆయన రాసే డైలాగులు థియేటర్లలో చప్పట్ల వర్షం కురిపించేవి.
భాగ్యరాజ్ కెరీర్లో వచ్చిన ‘ముందానై ముడిచ్చు’, ‘అందా 7 నాట్కల్’, ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’ మూవీలు కోలీవుడ్ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ చిత్రాలుగా మిగిలాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అప్పటి టాప్ హీరో ఎంజీఆర్ ఒక సందర్భంలో భాగ్యరాజ్ ప్రతిభను చూసి.. సినీ ఇండస్ట్రీలో ఇతనే తన వారసుడు అని ప్రకటించడం అప్పట్లో సంచలనాన్నే రేపింది.

కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్లో కూడా భాగ్యరాజ్ తన ముద్ర వేశారు. అమితాబ్ బచ్చన్ డ్యూయెల్ రోల్ ప్లే చేసిన బ్లాక్బస్టర్ సినిమా ‘ఆఖ్రీ రాస్తా’కు భాగ్యరాజ్ డైరెక్టర్ కావడం విశేషం. ఈ మూవీతో ఆయన జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.
తాజాగా భాగ్యరాజ్ మరణంతో ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఒక గొప్ప సృజనాత్మక మేధావిని, కథల మాంత్రికుడిని కోల్పోయినట్లు అయింది. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి చెన్నైలోని భాగ్యరాజ్(K Bhagyaraj) నివాసానికి సినీ తారలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.





