RBI:సైబర్ బాధితులకు డబ్బులు వాపస్..బాధితులకు ఆర్బీఐ ఈ డబ్బెక్కడి నుంచి ఇస్తుంది?
RBI: డిజిటల్ మోసాల వల్ల డబ్బులు పోగొట్టుకున్నవారికి గరిష్ఠంగా రూ.25,000 వరకు పరిహారం అందిస్తామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
RBI
ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే వాడకం ఎంత పెరిగిందో, అదే విధంగా సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. అకౌంట్ ఖాళీ అవ్వడానికి ఒక్క చిన్న పొరపాటు చాలు . ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలుస్తూ ఆర్బీఐ(RBI) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిజిటల్ మోసాల వల్ల డబ్బులు పోగొట్టుకున్నవారికి గరిష్ఠంగా రూ.25,000 వరకు పరిహారం అందిస్తామని ఆర్బీఐ(RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
సాధారణంగా ఎవరికైనా ఓటీపీ (OTP) చెబితే అది కస్టమర్ తప్పు అన్నట్లు బ్యాంకులు బాధ్యత వహించేవి కావు. కానీ ఇప్పుడు కస్టమర్ తెలియక లేదా పొరపాటున ఓటీపీ చెప్పి మోసపోయినా కూడా ఈ పరిహారం వారికి వర్తిస్తుందని ఆర్బీఐ(RBI) చెబుతోంది. అయితే, ఇక్కడే ఒక కండిషన్ ఉంది. ఈ సౌకర్యం ఒక కస్టమర్ జీవిత కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే వాడుకోగలరు. అలాగే, బాధితుడు కావాలని చేసిన తప్పు కాదని, ఎలాంటి దురుద్దేశం లేదని నిర్ధారించుకున్నాకే ఈ డబ్బులు చెల్లిస్తారు.
అయితే పరిహారం ఇవ్వడానికి ఆర్బీఐకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. బ్యాంకుల్లో పదేళ్ల పాటు ఎవరూ క్లెయిమ్ చేయకుండా అలాగే మూలన పడి ఉన్న డిపాజిట్లు సుమారు రూ.85,000 కోట్లు ఉన్నాయి. దీనిని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’ (DEA Fund) అంటారు. ఇప్పుడు ఈ నిధి నుంచి మోసపోయిన బాధితులకు పరిహారం అందజేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ మోసాల్లో దాదాపు 65 శాతం కేసులు రూ.50,000 లోపే ఉన్నాయి. కాబట్టి ఆర్బీఐ ఇచ్చే రూ.25,000 పరిహారం చాలామంది బాధితులకు పెద్ద ఊరటనిస్తుందనే చెప్పొచ్చు.
మరోవైపు ప్రజల్లో బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ అలవాట్లను పెంచడం కోసం ఆర్బీఐ ఒక చిన్న కండిషన్ విధించింది. మోసపోయిన మొత్తంలో 85 శాతం మాత్రమే పరిహారంగా ఇస్తారు. మిగిలిన 15 శాతాన్ని మాత్రం బాధితుడే భరించాలి. ఉదాహరణకు మీరు రూ.10,000 పోగొట్టుకుంటే కనుక మీకు రూ.8,500 పరిహారంగా అందుతుంది. ఒకవేళ రూ.50,000 పోగొట్టుకున్నా, గరిష్ఠ పరిమితి ప్రకారం ఇస్తారు కాబట్టి.. రూ.25,000 మాత్రమే లభిస్తుంది.

కాగా ఈ శుక్రవారం జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో (MPC)..ఇంట్రస్ట్ రేట్లపై కూడా గవర్నర్ క్లారిటీ ఇచ్చారు. రెపో రేటును ఎటువంటి ఛేంజ్ లేకుండా 5.25 శాతం వద్ద స్థిరంగా ఉంచారు. అంటే మీ హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ కడుతున్న ఈఎంఐలలో ప్రస్తుతానికి ఎలాంటి పెరుగుదల, తగ్గుదల ఉండదు. దేశ ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతుందని ఆర్బీఐ అంచనా వేసింది.
వృద్ధుల కోసం అదనపు అథెంటికేషన్తో పాటు బెనిఫీషియరీ అకౌంట్ల క్రెడిట్లో కొంత ఆలస్యం (Lagged Credit) వంటి కొత్త భద్రతా నిబంధనలను కూడా త్వరలో తీసుకురాబోతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీనిద్వారా సైబర్ మోసగాళ్లకు డబ్బు చేరకముందే అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ కొత్త నియమావళికి సంబంధించిన ముసాయిదాను.. త్వరలోనే అమలులోకి తీసుకురానున్నారు.
Pawan Kalyan:ప్రచారం రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్..ఫలితాలపై ప్రభావం పడుతుందా?



