Just NationalLatest News

Vikram-32:విక్రమ్-32.. సెమీకండక్టర్ రంగంలో భారత్ చారిత్రాత్మక మైలురాయి

Vikram-32: విక్రమ్-32 ఒక 32-బిట్ ప్రాసెసర్.లాంచ్ వెహికల్స్‌లో నావిగేషన్, కంట్రోల్, మిషన్ మేనేజ్‌మెంట్ వంటి కీలక పనులను నిర్వహించడం దీని ప్రధాన విధి.

Vikram-32

సెమీకాన్‌ ఇండియా-2025 సదస్సులో భారతదేశం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది. దేశీయంగా రూపొందించిన మొట్టమొదటి చిప్, విక్రమ్-32(Vikram-32), ఈ కార్యక్రమంలో ప్రదర్శించబడింది. ఇది సెమీకండక్టర్ల రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారతదేశం వేసిన తొలి బలమైన అడుగుగా నిలిచింది. ఈ కీలకమైన ప్రాసెసర్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) , చండీగఢ్‌లోని సెమీకండక్టర్ లాబొరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

ఈ చిప్‌ను అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులలో కూడా పనిచేసేలా రూపొందించారు. ఇది మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ అతి శీతల ఉష్ణోగ్రతల నుంచి ప్లస్ 125 డిగ్రీల సెల్సియస్ వేడిని కూడా తట్టుకోగలదు. అయితే, ఈ చిప్ సాధారణ గృహ వినియోగం లేదా వాణిజ్య పరికరాలైన ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల కోసం కాదు. ఇది కేవలం అంతరిక్ష పరిశోధనల కోసం మాత్రమే తయారు చేయబడింది. రాకెట్లు, ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్స్‌లోని ఏవియానిక్స్‌లో దీనిని ఉపయోగించనున్నారు. ఇది గతంలో 2009లో రూపొందించిన విక్రమ్-16 ప్రాసెసర్‌కు ఒక అధునాతన వెర్షన్.

విక్రమ్-32(Vikram-32) ఒక 32-బిట్ ప్రాసెసర్.లాంచ్ వెహికల్స్‌లో నావిగేషన్, కంట్రోల్, మిషన్ మేనేజ్‌మెంట్ వంటి కీలక పనులను నిర్వహించడం దీని ప్రధాన విధి. సెకన్లలో లక్ష్యాలను గణించడం, రాకెట్ సరైన మార్గంలో వెళ్లేలా చూసుకోవడం వంటి బాధ్యతలను ఇది సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అంతరిక్షంలో ఉండే తీవ్రమైన వేడి, చలి, ప్రకంపనలు, రేడియేషన్‌ను తట్టుకునేలా దీనిని మిలటరీ గ్రేడ్ ప్రమాణాలతో తయారు చేశారు. ఈ చిప్ పనితీరు 64-బిట్ ప్రాసెసర్‌కు సమానంగా ఉంటుందని పరీక్షల్లో తేలింది. ఇంతకు ముందు, ఇస్రో తన లాంచ్ వెహికల్స్‌లో కేవలం విక్రమ్-16 చిప్‌ను మాత్రమే ఉపయోగించేది.

Vikram-32
Vikram-32

విక్రమ్-32(Vikram-32 చిప్‌ను ఇప్పటికే అంతరిక్షంలో విజయవంతంగా పరీక్షించారు. పీఎస్‌ఎల్‌వీ-సీ60 మిషన్‌లో భాగంగా, దీనిని ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంట్ మాడ్యూల్‌లోని మిషన్ మేనేజ్‌మెంట్ కంప్యూటర్‌లో ఉపయోగించారు. అక్కడ దాని అద్భుతమైన పనితీరు ఇస్రోకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 5న విక్రమ్-32 , కల్పన-32 చిప్‌ల ఉత్పత్తిని ప్రారంభించి, ఇస్రో ఛైర్మన్ నారాయణన్ వాటిని ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్‌కు అందజేశారు.

అంతరిక్ష ప్రయోగాలకు అవసరమయ్యే చిప్స్ వాణిజ్య మార్కెట్‌లో సాధారణంగా అందుబాటులో ఉండవు. వాటిని ప్రత్యేకించి కఠిన వాతావరణాన్ని తట్టుకునేలా రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు, భారతదేశం ఇటువంటి ప్రత్యేకమైన చిప్‌ల కోసం ఇతర దేశాలపై ఆధారపడేది. విక్రమ్-32 ఆవిష్కరణతో భారత్ ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించింది.

ఈ ప్రాసెసర్‌తో పాటు, భారత్ అడా కంపైలర్లు, అసెంబ్లర్లు, లింకర్లు, సిమ్యులేటర్లను కూడా అభివృద్ధి చేసుకుంది. దీనివల్ల అంతరిక్ష కార్యక్రమాలకు అవసరమైన హార్డ్‌వేర్, కీలక అప్లికేషన్‌ల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గినట్లే. ఇది భారతదేశ సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు..గీతా ఆర్ట్స్ ప్రత్యేక వీడియో

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button