Just TelanganaLatest News

High Court : రూ. 500 లంచం కేసు..20 ఏళ్ల తర్వాత తీర్పు.. కోర్టు ఏం చెప్పింది?

High Court: 2005లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ) ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న ఒక జూనియర్ అసిస్టెంట్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.

High Court

న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ, అది ఎప్పుడూ గెలిచితీరుతుంది. ఇదే ఇప్పుడు మరోసారి రుజువైంది. కేవలం రూ. 500 లంచం కేసులో 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత, ఒక జూనియర్ అసిస్టెంట్ నిర్దోషిగా బయటపడ్డారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పు, ఒక వ్యక్తి జీవితాన్ని పాడుచేయగల తప్పుడు ఫిర్యాదుల నుంచి చట్టం ఎలా రక్షిస్తుందో నిరూపించింది. ఇది కేవలం ఒక తీర్పు మాత్రమే కాదు, నిజమైన న్యాయం గెలిచిందని చెప్పాలి.

2005లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ) ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న ఒక జూనియర్ అసిస్టెంట్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. బేగంపేటలో ఇల్లు కొనుగోలు చేసిన ఒక ఫిర్యాదుదారుడు, మ్యుటేషన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలని కోరాడు. ఆ పని కోసం జూనియర్ అసిస్టెంట్ రూ. 500 లంచం డిమాండ్ చేశారని ఆరోపణ. ఏసీబీ ట్రాప్‌లో లంచం తీసుకుంటూ అతను పట్టుబడ్డాడు. అతని చేతికి సోడియం కార్బొనేట్ పరీక్ష చేయగా గులాబీ రంగులోకి మారడం, లంచం డబ్బులు అతని జేబులో లభించడం వంటి ఆధారాలు లభించాయి. అయితే, కింది కోర్టు మార్చి 7, 2013న ఆ జూనియర్ అసిస్టెంట్‌ను నిర్దోషిగా ప్రకటించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఏసీబీ.. హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది.

జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ ఏసీబీ దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించింది, అవే ఈ తీర్పుకు కీలకంగా మారాయి.
లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సమయంలో, నిందితుడి వద్ద మ్యుటేషన్ అప్లికేషన్ పెండింగ్‌లో లేదని కోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ ట్రాప్ వేసినప్పుడు కూడా ఎలాంటి అధికారిక పని జరగలేదు.

అలాగే క్రాస్ ఎగ్జామినేషన్‌లో, ఫిర్యాదుదారుడు ఒక కీలకమైన విషయాన్ని అంగీకరించాడు. సరైన పత్రాలు లేకుండా మ్యుటేషన్ ప్రాసెస్ చేయడానికి నిందితుడు నిరాకరించడంతో, అతనిపై పగతోనే ఈ కుట్రకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.

ఈ తీర్పు ద్వారా, కేవలం లంచం తీసుకున్నారు అనే ఒక్క అంశం మాత్రమే కాకుండా, ఆ చర్య వెనుక ఉన్న సందర్భం, ఫిర్యాదుదారుడి నిజాయితీ కూడా ఎంత ముఖ్యమో హైకోర్టు (High Court) నిరూపించింది. 20 ఏళ్లుగా కేసుల చుట్టూ తిరుగుతూ, మానసిక వేదన అనుభవించిన ఆ జూనియర్ అసిస్టెంట్ జీవితంలో ఈ తీర్పు ఒక కొత్త వెలుగునిచ్చింది. అయితే న్యాయం గెలవడానికి ఏకంగా 20 ఏళ్లు సమయం తీసుకోవడంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button