Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు..తర్వాత నోటీసులు ఎవరికి ?
Phone Tapping Case : బీఆర్ఎస్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ కవితను కూడా సిట్ విచారించడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకనేతగా ఉన్న కవితకు ఎంతో కొంత సమాచారం తెలిసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు
Phone Tapping Case
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case )లో కీలక నేతలందరి విచారణ వరుసగా ముగుస్తోంది. పోలీసు అధికారుల తర్వాత వరుసగా హరీశ్ రావు, కేటీఆర్. కేసీఆర్ విచారణ ను ముగించిన సిట్ అధికారుల తర్వాతి స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో తర్వాత ఎవరికి నోటీసులిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.
ఆదివారం కేసీఆర్ విచారణ ఐదు గంటల పాటు సాగింది. ఎర్రవల్లిలో తాను ఉంటున్న నివాసానికి నోటీసులు ఇవ్వాలని కేసీఆర్ లేఖ రాసినా పోలీసులు మాత్రం నందినగర్ లో నివాసానికే నోటీసులు పంపించారు. దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినా ఆదివారం విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ విచారణ జరుగుతున్నంతసేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ భవన్ , నందినగర్ దగ్గర కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కేసీఆర్ ను రెండో అంతస్తులో గదిలో సిట్ అధికారుల బృందం విచారించింది.
దాదాపు నాలుగున్నర గంటలపాటు విచారణ సాగింది. ఈ కేసులో ఇప్పటి వరకూ తాము సేకరించిన ఆధారాలను ముందుంచి సిట్ అధికారులు కేసీఆర్ ను పలు ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది. దీని వెనుక మీరే ఉన్నారా అని ప్రశ్న అడగ్గా.. తనకేం సంబంధం లేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం.

కేసీఆర్ స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు వీడియో, ఆడియో రూపాల్లో రికార్డ్ చేసుకున్నారు. చాలా అంశాలకు సంబంధించి కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే తప్పుడు కేసులతో ఇరుకున పడద్దంటూ సిట్ కు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఏడుగురు పోలీసు అధికారులను విచారించి రాబట్టిన వివరాలతోనే కేసీఆర్ ను పలు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ప్రస్తుతం కేసీఆర్ విచారణ కూడా ముగియడంతో తర్వాత ఈ కేసులో ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది.
ఇంకా ఎవరికి నోటీసులు ఇచ్చి విచారణ జరపాలన్న దానిపై పోలీసులు ఒకటి రెండు రోజుల్లో ఆధారాల ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case )లో బీఆర్ఎస్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ కవితను కూడా సిట్ విచారించడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకనేతగా ఉన్న కవితకు ఎంతో కొంత సమాచారం తెలిసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చట్ట ప్రకారం ఆమెకు కూడా నోటీసులిచ్చి విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షాట్ ధాఖలు చేసే అవకాశాలున్నాయి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



