U19 World Cup : సెమీఫైనల్లో భారత్..మన కుర్రాళ్ల దెబ్బకు పాక్ ఔట్
U19 World Cup : అండర్ 19 ప్రపంచకప్ లో టైటిల్ ఫేవరెట్ భారత్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో యువ భారత్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది.
U19 World Cup
అండర్ 19 ప్రపంచకప్(U19 World Cup) లో టైటిల్ ఫేవరెట్ భారత్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో యువ భారత్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ లో తడబడి నిలబడిన భారత కుర్రాళ్లు బౌలింగ్ లో అదరగొట్టి పాక్ ను ఇంటికి పంపించారు. ఒక దశలో పాక్ గెలిచేలా కనిపించినా అద్భుతంగా పుంజుకున్నభారత యువ బౌలర్లు వరుస వికెట్లు తీసి పాక్ ను దెబ్బకొట్టారు.
మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ అండర్ 19 జట్టు 252 పరుగులకు ఆలౌటైంది. నిజానికి భారత్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు ఆరోన్ జార్జ్ , వైభవ్ సూర్యవంశీ దూకుడుగానే ఆరంభించారు. 7 ఓవర్లలో 47/0 తో ఉండగా.. 8వ ఓవర్లో 3 కీలక వికెట్లు కోల్పోవడంతో స్కోరు 47/3గా మారిపోయింది. కష్టాల్లో ఉన్న భారత్ ను వేదాంత్ , విహాన్ ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 62 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన వేదాంత్ ఔటైన తర్వాత కనిష్క చౌహాన్ , ఖిలాన్ పటేల్ కూడా 50 పరుగులు జోడించడంతో భారత్ స్కోరు 250 దాటింది. వేదాంత్ త్రివేది 68, కవిష్క చౌహాన్ 35, వైభవ్ సూర్యవంశీ 30 పరుగులతో రాణించారు.

ఛేజింగ్ లో కాస్త దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ యువ జట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ తో మూల్యం చెల్లించుకుంది. సెమీస్ కు చేరాలంటే 33.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించాలన్న ఆలోచనతో ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. ఇదే క్రమంలో మిడిల్ ఓవర్స్ లో భారత్ బౌలర్లను తక్కువ అంచనా వేసి దెబ్బతింది. కీలక సమయంలో వికెట్లు తీసిన మన బౌలర్లు పాక్ జట్టును 194 పరుగులకే ఆలౌట్ చేశారు. బ్యాటింగ్ లో విఫలమైన కెప్టెన్ ఆయుశ్ మాత్రే 3 వికెట్లు తీయగా..ఖిలాన్ పటేల్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు.
సెమీఫైనల్లో భారత్ , ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. మరో సెమీస్ లో ఆస్రేలియా, ఇంగ్లాండ్ ఢీకొంటాయి. ఈ మ్యాచ్ లో కూడా భారత్ నో షేక్ హ్యాండ్ సంప్రదాయాన్నే కొనసాగించింది. టాస్ సమయంలోనూ, మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ క్రికెటర్లతో భారత్ ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. గత ఏడాది ఆసియాకప్ నుంచీ పాక్ తో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడినా భారత్ ప్లేయర్స్ నో షేక్ హ్యాండ్ కే కట్టుబడి ఉన్నారు.



