Just TelanganaLatest News

Revanth : కేసీఆర్‌ను నేనెందుకు అరెస్టు చేస్తాను..రేవంత్ అసలీ మాట ఎందుకన్నారు?

Revanth : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌ను ఓడించడమే అతిపెద్ద శిక్ష!

Revanth

తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యంగా, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించిన ఈ సమయంలో.. కేసీఆర్‌ను అరెస్టు చేస్తారనే వదంతులు రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఈ ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి.

“కేసీఆర్‌ను నేనెందుకు అరెస్టు చేస్తాను?” అని ఆయన ప్రశ్నించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మాటల ద్వారా ఆయన రాజకీయ ప్రత్యర్థిపై వ్యక్తిగత కక్ష సాధింపులు కాకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి (Revanth )కేవలం అరెస్టు గురించి మాత్రమే మాట్లాడలేదు, కేసీఆర్‌కు ఇప్పటికే అతిపెద్ద శిక్ష విధించబడిందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. “10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ప్రజలు ఎన్నికల్లో ఓడించి, ప్రతిపక్ష నాయకుడిగా మార్చడం కంటే పెద్ద శిక్ష ఏముంటుంది?” అని ఆయన ప్రశ్నించారు. ఈ మాటల్లో ప్రజల తీర్పే అత్యున్నతమైనదని, ఎన్నికల ఫలితమే అత్యంత కఠినమైన శిక్ష అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి పరాజయం కాదని, ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎలా తిరస్కరించారో తెలిపే బలమైన సందేశం అని ఆయన నొక్కి చెప్పారు.

Revanth reddy
Revanth reddy

అంతేకాకుండా, రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యంగ్యంగా “ఆయన ఫామ్‌హౌస్ ఇప్పుడు ఆయనకు జైలు లాంటిదే” అని వ్యాఖ్యానించారు. ఈ మాటల ద్వారా ఆయన కేసీఆర్ ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి, రాజకీయ కార్యకలాపాలకు దూరంగా, తన ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని సూచించారు. గతంలో పరిపాలనలో ఉన్నప్పుడు కేసీఆర్ అనుసరించిన విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో వ్యక్తమైందని, ప్రజలే ఆయనకు సరైన గుణపాఠం చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. తన ప్రభుత్వం అక్రమాలను వెలికితీస్తుందని, అయితే ఆ తప్పులకు ప్రజలే శిక్ష విధించారని ఆయన పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఈ వివాదంపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు ఒక్క కేసీఆర్‌(KCR)నే బాధ్యుడిని చేయడం సరికాదని .. కేసీఆర్‌పై అవినీతి మచ్చ వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా కవిత(Kavitha) ఆరోపిస్తున్నారు. అయితే, కవిత ఆరోపణలకు రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు సరైన సమాధానం చెప్పినట్లయింది. వ్యక్తిగత కక్ష సాధింపులు కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలోనే తాము పోరాడుతున్నామని, ప్రజల తీర్పే తమకు ప్రధానమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ద్వారా కవిత ఆరోపణలకు పరోక్షంగా బదులిచ్చినట్లయింది.

మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. కేసీఆర్‌పై వ్యక్తిగత దాడి కాకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజకీయంగానే ఎదుర్కోవాలన్న తన విధానాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తుండగా, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button