Uddhav Thackeray : ఉద్ధవ్ శివసేన చీలిపోనుందా ?..షిండేతో యూబీటీ ఎంపీల భేటీ
Uddhav Thackeray : యూబీటీకి చెందిన ఏడుగురు ఎంపీలు షిండే పార్టీలో చేరనున్నారనే ప్రచారం మధ్య, వారు షిండేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి
Uddhav Thackeray
మహారాష్ట్రలో శివసేన పార్టీల మధ్య రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉద్ధవ్ కు చెందిన శివసేన యూబీటీ చీలిపోయే దిశగా సాగుతోంది. ప్రస్తుతానికి ఈ వార్తలను ఉద్ధవ్ ఖండించినా తెరవెనుక మాత్రం ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి కారణం శివసేన యూబీటీకి చెందిన పలువురు ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో సమావేశం కావడమే.
యూబీటీలోని ఏడుగురు ఎంపీలు షిండేకు చెందిన పార్టీలో చేరుతున్నారని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆ ఏడుగురు షిండేతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఈ పరిణామాలతో ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray) అప్రమత్తమయ్యారు.
వెంటనే తన నివాసంలో ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు.ఈ సమావేశానికి ముగ్గురు యూబీటీ ఎంపీలు దూరమవడం చర్చకు దారి తీసింది.దీంతో ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray) అప్రమత్తమయ్యారు. పార్టీ నేతలు, ఎంపీలతో బాంద్రా ఈస్ట్ ప్రాంతంలోని మాతోశ్రీ నివాసంలో కీలక సమావేశాన్ని ఆదివారంనాడు ఏర్పాటు చేశారు. ఓంప్రకాష్ రాజెనింబాల్కర్, భౌసాహెబ్ రాజారామ్ వాక్ చౌరే, సంజయ్ హరి భౌ జాదవ్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు.
షిండేతో భేటీ అయిన ఏడుగురిలో భేటీకి డుమ్మా కొట్టిన ముగ్గురు ఎంపీలు ఉన్నట్టు గుర్తించారు. జూన్ 7న వీరంతా షిండేతో రహస్యంగా సంప్రదింపులు జరిపినట్టు కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ పరిణామాలను బలపరుస్తూ కేంద్ర మంత్రి, శివసేన ఎంపీ ప్రతాప్రావు జాదవ్ ఒక ప్రకటన చేశారు.

ఆపరేషన్ టైగర్ దాదాపు పూర్తి అయిందంటూ వ్యాఖ్యానించారు. షిండే ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఈ ఆపరేషన్ పూర్తవుతుందంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు యూబీటీ మాత్రం తమ పార్టీ ఐక్యంగానే ఉందని, ఎలాంటి చీలక లేదని శివసేన చెబుతోంది. ముగ్గురు ఎంపీలు వ్యక్తిగత కారణాలతో సమావేశానికి రాలేదని పేర్కొంది.
భవిష్యత్ కార్యచరణ కోసం సమావేశం నిర్వహించామని వెల్లడించింది.దీంతో ఏడుగురు ఎంపీలు పార్టీ మారడం లాంఛనమేనంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రెండు పార్టీల బలాబలాలను చూస్తే షిండే శివసేనకు చెందిన ఏడుగురు ఎంపీలు లోక్సభలో ఉన్నారు. ఎన్డీయేలో బీజేపీ, టీడీపీ, జేడీయూ తర్వాత ఆ పార్టీనే అతిపెద్ద భాగస్వామిగా కొనసాగుతోంది. ఒకవేళ ఏడుగురు ఎంపీలు యూబీటికి గుడ్ బై చెబితే ఉద్ధవ్ శివసేన చీలిపోవడం ఖాయం. అప్పుడు లోక్సభలో ఎన్డీయే సభ్యుల బలం పెరుగుతుంది.





