Udhayanidhi Stalin : డబుల్ మీనింగ్ కామెంట్స్ రగడ..ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. సెక్షన్ల కింద కేసు బుక్
Udhayanidhi Stalin : అరెస్ట్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ మీడియా ముందు స్పందిస్తూ..తాను ఎవరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదని.. తప్పుగా కూడా ఏమీ మాట్లాడలేదని అన్నారు.
Udhayanidhi Stalin
తమిళనాడు పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. మాజీ మంత్రి, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin)ను పోలీసులు ఆయన నివాసంలోనే అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. డీఎంకే నిర్వహించిన ఒక బహిరంగ సభలో సీఎం విజయ్, హీరోయిన్ త్రిషను ఉద్దేశించి ఉదయనిధి అనుచిత కామెంట్లు చేశారనే ఆరోపణలతో.. తంజావూరు పోలీస్ స్టేషన్లో 6 వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయమే భారీ సంఖ్యలో పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ఇంటిని చుట్టుముట్టగా, మరోవైపు విషయం తెలుసుకున్న డీఎంకే శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకుని తీసుకెళ్తుండగా.. డీఎంకే కార్యకర్తలు పోలీసు వెహికల్స్ను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. సీఎం విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో.. పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. చివరికి పోలీసులు గుంపును చెదరగొట్టి ఉదయనిధిని వాహనంలో అక్కడి నుంచి తరలించారు. అయితే కేవలం విచారణ నిమిత్తమే ఉదయనిధి స్టాలిన్ను తీసుకెళ్తున్నామని కొందరు అధికారులు చెప్పారు.
అరెస్ట్ తర్వాత ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) మీడియా ముందు స్పందిస్తూ..తాను ఎవరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదని.. తప్పుగా కూడా ఏమీ మాట్లాడలేదని అన్నారు. ఈ కేసును లీగల్గానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ లీగల్ టీమ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ జరగనుంది.
మరోవైపు, ఉదయనిధి వెంటనే తన కామెంట్లను వెనక్కి తీసుకుని విజయ్, త్రిషలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని తమిళగ వెట్రి కజగం (టీవీకే) నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆగస్ట్ 3 సోమవారం తంజావూరులో కావేరీ జలాల సమస్యపైన.. డీఎంకే ఆధ్వర్యంలో ఒక నిరసన సభ జరిగింది. ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు.

దానికి ఉదయనిధి నవ్వుతూ ..కావేరీ సమస్యపై ముఖ్యమంత్రి విజయ్ అసలు నోరు విప్పడం లేదు. నీళ్లు ఎక్కడికి చేరకపోయినా అక్కడైతే కచ్చితంగా చేరాలని..తాను అన్నది కావేరీ నీళ్ల గురించేనంటూ కామెంట్ చేశారు. దీంతో ఉదయనిధి మాటలు త్రిష, విజయ్లను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వచ్చేలా ఉన్నాయంటూ.. మండిపడ్డ టీవీకే నాయకులు మహిళా కమిషన్తో పాటు పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ యాక్షన్ సీన్లోకి దిగడంతో ఇది చివరికి అరెస్ట్కు దారి తీసింది.





