Pawan Kalyan:చట్టం ఎవరికైనా ఒకటే.. క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: విజయ్ను ఎన్డీయే కూటమిలోకి తీసుకువచ్చే బాధ్యతను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అప్పగించారనే వార్తలను కూడా పవన్ కొట్టిపారేశారు.
Pawan Kalyan
తమిళ స్టార్ హీరో విజయ్ తన ఆఖరి సినిమాగా ప్రకటించిన జన నాయగన్ రిలీజ్ విషయంలో ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది. ఈ సినిమా నిజానికి సంక్రాంతి కానుకగా జనవరిలోనే రావాల్సి ఉంది. అయితే సెన్సార్ పరమైన అడ్డంకుల వల్ల ఈ మూవీ వాయిదా పడింది.
విజయ్ రాజకీయాల్లోకి రావడం వల్ల.. విజయ్ జన నాయగన్ సినిమాను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటోందని కొందరు విమర్శలు చేశారు. ఈ ప్రచారంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు.
సెన్సార్ బోర్డు అనేది ఒక స్వతంత్ర సంస్థ అని చెప్పి, అది నిబంధనల ప్రకారమే తన పని తాను చేసుకుపోతుందని పవన్ స్పష్టం చేశారు. సినిమా రిలీజ్ విషయంలో ఆలస్యం జరిగితే దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బాధ్యులను చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి ఉదాహరణగా తన సొంత సినిమా అయిన ఓజీ కి జరిగిన అనుభవాన్ని పవన్(Pawan Kalyan) గుర్తు చేసుకున్నారు.
తాను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా కూడా తన సినిమాలోని హింసను బట్టి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పిన పవన్.. ఆ నిర్ణయాన్ని తాను గౌరవించానని చెప్పుకొచ్చారు. సినిమాలో హింస ఎక్కువగా ఉన్నప్పుడు దానికి యూఏ సర్టిఫికేట్ తాను కావాలని కోరుకోవడం కరెక్ట్ కాదన్న విషయాన్ని చెబుతూ ..చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

అంతేకాదు విజయ్ను ఎన్డీయే కూటమిలోకి తీసుకువచ్చే బాధ్యతను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు అప్పగించారనే వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. అవన్నీ కేవలం పుకార్లేనని చెబుతూ.. విజయ్ను తాను కలిసి సుమారు పాతికేళ్లు అవుతోందని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం విజయ్ జననాయగన్ సినిమా వివాదం కోర్టులో ఉంది. మార్చి 17న సెన్సార్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ఈ సినిమా విడుదలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హెచ్ వినోద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో విజయవంతమైన భగవంత్ కేసరి కథకు కొన్ని మార్పులు చేసి రూపొందించారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటించారు.





