Temples:భాగ్యనగర భక్తి వైభవం..హైదరాబాద్లోని ఈ దేవాలయాల గురించి తెలుసా?
Temples: ఆధునికతతో పాటు ఆధ్యాత్మికతను కాపాడుకుంటూ వస్తున్న హైదరాబాద్లో.. దర్శించాల్సిన కొన్ని ముఖ్యమైన దేవాలయాలు చాలా ఉన్నాయి.
- Temples
హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీ, ఐటీ కంపెనీలే చాలామందికి గుర్తు వస్తాయి. అయితే ఇక్కడ కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రాలు(Temples) కూడా భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి. ఆధునికతతో పాటు ఆధ్యాత్మికతను కాపాడుకుంటూ వస్తున్న హైదరాబాద్లో.. దర్శించాల్సిన కొన్ని ముఖ్యమైన దేవాలయాలు(Temples) చాలా ఉన్నాయి.
బిర్లా మందిరం-హైదరాబాద్ పేరు చెప్పగానే మొదటిగా ఆధ్యాత్మిక కేంద్రం నౌబత్ పహాడ్లోని బిర్లా మందిరం గుర్తొస్తుంది. హైదరాబాద్లోని నడిబొడ్డున ఒక ఎత్తైన కొండపై శ్వేతవర్ణంలో మెరిసిపోయే.. ఈ బిర్లామందిర్ పూర్తిగా రాజస్థానీ పాలరాతితో నిర్మించబడింది. ఇక్కడ కొలువైన వెంకటేశ్వర స్వామి విగ్రహం అచ్చంగా తిరుమల శ్రీవారిని తలపిస్తుంది. ఇక్కడ ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే,ఈ ఆలయం మొత్తం పాలరాతితో కట్టారు.అలాగే ఆలయ ప్రాంగణంలో ఎక్కడా కూడా గంటలు ఉండవు. రాత్రివేళ విద్యుత్ దీపాల కాంతిలో ఈ బిర్లా టెంపుల్ ఒక అద్భుత కళాఖండంలా కనిపిస్తుంది.

చిలుకూరు బాలాజీ టెంపుల్ – గండిపేట చెరువు సమీపంలో ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ వీసా బాలాజీ ఆలయంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఇక్కడ స్వామికి మొక్కుకుంటే వీసా వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత ఏమిటంటే.. ఇక్కడ ఎలాంటి హుండీ ఉండదు, విరాళాలు తీసుకోరు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని 11 ప్రదక్షిణలు, నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడి ఆచారం.

పెద్దమ్మ తల్లి దేవాలయం -హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా ప్రాముఖ్యమైనది. బోనాల పండుగ సమయంలో ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అమ్మవారు అత్యంత శక్తివంతురాలని, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అని నమ్ముతూ ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తారు. ఇక్కడి ఆలయ గోపురం, శిల్పకళా సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

టీటీడీ టెంపుల్ – తిరుమల వెళ్లలేని భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్లో ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏడుకొండల స్వామి వారికి జరిగే నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు అచ్చం తిరుమల లాగానే ఉంటాయి. తిరుమల లడ్డు ప్రసాదం కూడా ఇక్కడ అందుబాటులో ఉండటం భక్తులకు ఒక గొప్ప వరం.

ఫిల్మ్ నగర్ దైవసన్నిధానం.. జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్లో ఉన్న ఈ టెంపుల్స్ ఒకే ప్రాంగణంలో అనేక మంది దేవతామూర్తుల కొలువుగా విరాజిల్లుతోంది. వినాయకుడు, వేంకటేశ్వరుడు, శివుడు, అమ్మవారు ఇలా అందరు దేవుళ్లను ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి భక్తులకు మనశ్శాంతిని ఇస్తాయి. సినీ సెలబ్రెటీలు కూడా తరచుగా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు.

సాంఘీ టెంపుల్ .. నగరానికి కొంచెం దూరంలో నగర్ దగ్గర్లో ఉన్న ఒక అద్భుతమైన పర్యాటక , ఆధ్యాత్మిక క్షేత్రంగా సాంఘీ టెంపుల్ పేరు పడింది. ఒక కొండ పైన పరమానంద గిరి అనే పేరుతో పిలిచే చోట.. సాంఘీ టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయ రాజగోపురం సుదూరం నుంచి కూడా కనిపిస్తుంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామితో పాటు ఇతర దేవతా మూర్తులు కూడా కొలువై ఉన్నారు. ఈ ఆలయ శిల్పకళ, చుట్టూ ఉన్న తోటలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.


అనంత పద్మనాభ స్వామి ఆలయం – మణికొండలోని ఒక కొండపైన ఈ అద్భుతమైన అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. తిరువనంతపురంలోని పద్మనాభ స్వామిలాగే ఇక్కడ స్వామి వారు శేషతల్పంపై పడుకున్న భంగిమలో దర్శనమిస్తారు. ఈ గుడి చాలా పురాతనమైనది. సిటీ కోలాహలానికి దూరంగా, కొండపైన ప్రకృతి ఒడిలో ఉండటం వల్ల.. భక్తులు ఇక్కడ ధ్యానం చేసుకుంటూ గడుపుతుంటారు.





