Temperatures:రికార్డు స్థాయికి చేరుతున్న ఉష్ణోగ్రతలు..ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Temperatures : 3 నుంచి 6 డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Temperatures
ఆకాశం నుంచి నిప్పుల కొలిమి కురుస్తోందా అన్నట్లుగా దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండటంతో.. జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు(Temperatures )నమోదవుతుండటంతో, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రాబోయే 6 రోజుల పాటు తీవ్రమైన వడగాలుల ప్రభావం కొనసాగుతుందని, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బలూచిస్తాన్ , రాజస్థాన్లోని థార్ ఎడారి వైపు నుంచి వీస్తున్న వేడి గాలుల వల్లే ఉత్తర, మధ్య భారతదేశంతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం ఇంతలా వేడెక్కిపోయిందని చెబుతున్నారు.
తెలంగాణ విషయానికి వస్తే రాబోయే 3 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండబోతోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీమ్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండటంతో రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది.
తెలంగాణ లోని దాదాపు 14 జిల్లాలకు హీట్వేవ్ హెచ్చరికలు వచ్చాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, వరంగల్, హనుమకొండ పరిధిలో 45 డిగ్రీల కంటే ఎక్కువ వేడి నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రామగుండం, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను దాటేశాయి. రాజధాని హైదరాబాద్లో ఉష్ణోగ్రత 39.5 డిగ్రీల దగ్గర ఉన్నా సరే, గాలిలోని తేమ పెరిగిపోవడంతో ఉక్కపోత జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
మే 24 వరకు ఈ హీట్వేవ్ ఇలాగే ఉంటుందని చెబుతూనే, మరోపక్క దక్షిణ తెలంగాణ వైపు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే మిశ్రమ వాతావరణం కూడా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండల మంటలు తక్కువ ఏమీ లేవు. రానున్న నాలుగు రోజుల్లో ఇక్కడ కూడా వేడి ఇంకా పెరిగేలా ఉంది. అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు రికార్డు అయ్యే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
విజయనగరం, మార్కాపురం ఏరియాల్లో 44 నుంచి 45 డిగ్రీలు, అలాగే రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, చిత్తూరు, తిరుపతితో పాటు విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు(Temperatures) పెరుగుతాయని నివేదికలు చెబుతున్నాయి.
ఢిల్లీలో పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉండటంతో.. మే 26 వరకు ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు(Temperatures) రికార్డవుతున్నాయి. గతంలో 50 డిగ్రీల మార్కును తాకిన రోజులను గుర్తు చేస్తూ.. ఇప్పుడు కూడా పగలు 47 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు మండుతున్నాయి.
రాత్రి పూట కూడా వేడి తగ్గకపోవడంతో జనాలు అల్లాడిపోతున్నారు. దేశంలో మే 20న అత్యధికంగా ఉత్తరప్రదేశ్లోని బండాలో 48 డిగ్రీలు, మధ్యప్రదేశ్లోని ఖజురహోలో 47.4 డిగ్రీలు, నాగపూర్లో 46.6 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ భయంకరమైన వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు, అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు రోడ్లపై పనులు చేసుకునే కూలీలు వడ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బాడీలో నీటి శాతం తగ్గిపోకుండా ఉండటానికి రోజుకు సరిపడా మంచి నీళ్లతో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS), బార్లీ వాటర్ వంటి లిక్విడ్స్ను తరచుగా తాగుతూ ఉండాలి.





