Iran : ఇరాన్ ఇంధన కేంద్రాలే టార్గెట్.. అమెరికా, ఇజ్రాయెల్ కొత్త ప్లాన్
Iran : అమెరికా , ఇజ్రాయెల్ కొత్త ప్లాన్తో కలిసి రంగంలోకి దిగుతున్నాయి. ఇరాన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలు , ఇంధన కేంద్రాలే లక్ష్యంగా తమ వ్యూహాత్మక దాడులకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
Iran
అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు పతాక స్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం పూర్తిగా పక్కన పెట్టేశాయి. దీనిలో భాగంగానే అమెరికా , ఇజ్రాయెల్ కొత్త ప్లాన్తో కలిసి రంగంలోకి దిగుతున్నాయి. ఇరాన్(Iran) ఎనర్జీ మౌలిక సదుపాయాలు , ఇంధన కేంద్రాలే లక్ష్యంగా తమ వ్యూహాత్మక దాడులకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ యంత్రాంగం ఈ భారీ ఆపరేషన్కు సంబంధించిన ప్రణాళికలపై చర్చలు జరుపుతోంది. ఇరాన్లోని కీలక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలను దెబ్బతీయాలని అమెరికా ఆలోచిస్తోంది. ఇరాన్ హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను అడ్డుకుంటే, ప్రతిగా ఇరాన్లోని ఒక్కో విద్యుత్ కేంద్రం, వంతెనను బాంబులతో కూల్చివేస్తామని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా గతంలోనే హెచ్చరించారు. ఇప్పుడు ఆ ప్రణాళిక అమలు చేయడంపై దృష్టి పెట్టాయి. సైన్యం సిద్ధంగా ఉన్నా కూడా, ట్రంప్ తుది ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది.
ఒకవేళ ఇరాన్ కనుక అమెరికాతో దౌత్యపరమైన చర్చలకు ముందుకు వస్తే దాడులు ఆగిపోయే అవకాశం కూడా ఉంది. ఈ ఆపరేషన్లో అమెరికాకు మద్దతుగా నిలబడటానికి ఇజ్రాయెల్ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే తమ సైన్యాన్ని అప్రమత్తం చేశారు. ట్రంప్ సహాయం కోరినా లేదా ఇరాన్ ఎదురుదాడికి దిగినా ఇరాన్ అణు, చమురు వనరులపై విరుచుకుపడటానికి ఐడీఎఫ్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

మరోవైపు తమ ఎనర్జీ కేంద్రాలపై దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. దాడులకు దిగితే, ప్రతిగా మధ్యప్రాచ్యంలోని అమెరికా ఇంధన స్థావరాలతో పాటు ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తామని స్పష్టం చేసింది. సౌదీ, అమెరికా దాడులు చేస్తే సౌదీ అరేబియా, యూఏఈలోని చమురు క్షేత్రాలను, ఖతార్లోని గ్యాస్ క్షేత్రాలను బూడిద చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.





