Sravana Masam : శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు?.. భక్తి వెనుక సైన్స్ కూడా ఉందా?
Sravana Masam : శ్రావణ మాసంలో పాటించే ఉపవాసాలు, ఆహార నియమాలు అన్నీ కూడా బాడీని డిటాక్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
Sravana Masam
శ్రావణ మాసం రాగానే హిందువుల ఇళ్లలో, ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంటుంది. ఈ నెలలో పూజలు, నోములు, ఉపవాసాలతో పాటు చాలామంది మాంసాహారం తినడాన్ని పూర్తిగా పక్కన పెడతారు. దీని వెనుక కేవలం ఆధ్యాత్మిక నమ్మకాలే కాదు.. ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
శివుడు, విష్ణువు, లక్ష్మీ దేవిని ఆరాధించే ఈ పవిత్ర శ్రావణ మాసంలో పూజలు, ధ్యానం మీద ఏకాగ్రత కుదరడానికి తేలికగా అరిగే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని శాస్త్రాలు చెబుతాయి.
ఎందుకంటే మన సాంప్రదాయాల ప్రకారం మాంసాహారాన్ని తామసిక ఆహారంగా లెక్క కడతారు. మాంసాహారం శరీరంలో బద్ధకాన్ని, చంచలత్వాన్ని పెంచుతుందని నమ్ముతారు. అందుకే ఈ రోజుల్లో పండ్లు, పప్పులు, కూరగాయలు, ఆకు కూరలు వంటి తేలికపాటి భోజనానికి ప్రాధాన్యం ఇస్తారు.
ఇక సైంటిఫిక్ అండ్ హెల్త్ కోణంలో చూస్తే కనుక వర్షాకాలంలో శ్రావణ మాసం వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన జీర్ణక్రియ సాధారణ రోజుల కంటే కాస్త వీక్గా ఉంటుంది.

అలాంటి సమయంలో మాంసాహారం తింటే..అది అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, ఇది కడుపులో ఇన్ఫెక్షన్లు, అజీర్తి వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినిచ్చే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
శ్రావణ మాసం(Sravana Masam)లో పాటించే ఉపవాసాలు, ఆహార నియమాలు అన్నీ కూడా బాడీని డిటాక్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ మోతాదులో అది కూడా పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల హెల్త్ బ్యాలెన్స్ అవుతుంది. అందుకే భక్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శ్రావణ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.





