Stray dogs: వీధి కుక్కలపై ఆగని నిరసనలు..సుప్రీంకోర్టు మళ్లీ ఆలోచిస్తుందా?
Stray dogs: ఒకవైపు వీధి కుక్కల దాడులతో ప్రాణాలు కోల్పోతున్న అమాయకుల తల్లిదండ్రుల ఆవేదన, మరోవైపు స్వేచ్ఛగా జీవించే హక్కు కోసం పోరాడుతున్న మూగ జీవాల పక్షాన నిలబడిన జంతు ప్రేమికుల నిరసన.

Stray dogs
కొన్నిసార్లు చట్టం ఒక వైపు ఉంటే, మానవత్వం మరో వైపు ఉంటుంది. ఇటీవల సుప్రీంకోర్టు వీధి కుక్కలపై ఇచ్చిన సంచలన తీర్పు ఇదే పరిస్థితిని చూపిస్తుంది. ఒకవైపు వీధి కుక్కల దాడులతో ప్రాణాలు కోల్పోతున్న అమాయకుల తల్లిదండ్రుల ఆవేదన, మరోవైపు స్వేచ్ఛగా జీవించే హక్కు కోసం పోరాడుతున్న మూగ జీవాల పక్షాన నిలబడిన జంతు ప్రేమికుల నిరసన. ఈ రెండు వాదనల మధ్య ఈ దేశంలో కుక్కల పరిస్థితి, మన ఆలోచనా విధానం, సమాజం యొక్క భద్రత అనే అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి.
సుప్రీంకోర్టు ఈ వివాదాస్పద తీర్పు ఇవ్వడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో, దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు,హైదరాబాద్, నాగ్పూర్ వంటి మెట్రో నగరాల్లో చిన్న పిల్లలు, వృద్ధులు వీధి కుక్కల బారినపడి తీవ్రంగా గాయపడటం, చివరికి ప్రాణాలు కోల్పోవడం వంటి భయంకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రజల్లో భయం, ఆందోళన పెరిగిపోయాయి.
ఇలా స్థానిక మున్సిపాలిటీలు సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని పేర్కొంటూ అనేక ఫిర్యాదులు కోర్టుకు వచ్చాయి. దీంతో ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా, వీధి కుక్కలను పట్టుకొని, వాటిని ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు వచ్చీరాగానే జంతు ప్రేమికులు, పశు సంరక్షణ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగాయి. వారి వాదనలు కొన్ని ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి.జంతు సంరక్షణ చట్టాల ప్రకారం, వీధి కుక్కల(stray dogs)కు కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. వాటిని అకస్మాత్తుగా బంధించడం వాటి సహజ జీవనానికి విఘాతం కలిగిస్తుంది.
వీధుల్లో స్వేచ్ఛగా తిరిగే కుక్కలను ఒకేసారి షెల్టర్లకు తరలిస్తే అవి తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనంతో బాధపడతాయి. ఇది వాటి ఆరోగ్యం, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారతదేశంలో చాలా షెల్టర్లు సరైన వసతులు లేకుండా ఉన్నాయి. అవి కిక్కిరిసిపోయి ఉంటాయి. తగిన ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల వ్యాధులు, గాయాలు పెరిగి, కుక్కల మరణ శాతం పెరిగే అవకాశం ఉందని వారు వాదిస్తున్నారు.
మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరసనలు ఎక్కువ అవుతూ ఉండటంతో.. ప్రజాభిప్రాయం, జంతు హక్కుల పరిరక్షణ సంస్థల ఒత్తిడితో, ఈ తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) తిరిగి పరిశీలించే అవకాశం ఉన్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తంమీద, ఈ వివాదం మానవ భద్రతకు, జీవ హక్కులకు మధ్య ఉన్న సంక్లిష్టమైన వైరుధ్యాన్ని చూపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు మానవ భద్రతను కాపాడటానికి ఒక ప్రయత్నం మాత్రమే. కానీ, అసలు సమస్య పరిష్కారం కావాలంటే, జంతువుల పట్ల శాస్త్రీయమైన, దయతో కూడిన విధానాలను అవలంబించడమే సరైన మార్గం.