Heavy Rains : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు..ద్రోణి ఎఫెక్ట్ ఎప్పటి వరకూ ఉండనుంది?
Heavy Rains : ఈ నెల 19, 20, 21 వ తేదీల్లో మరింత ఎక్కువగా వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది.
Heavy Rains
ఏపీ , తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ కబురు వినిపించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి, తమిళనాడు రాష్ట్రం మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీని ఎఫెక్ట్తో రాబోయే ఐదు రోజులూ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. కొన్ని జిల్లాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్న అంచనాలతో ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.
తెలంగాణలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు వర్షాల జోరు కొనసాగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఈ నెల 19, 20, 21 వ తేదీల్లో మరింత ఎక్కువగా వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అక్కడ ఇప్పటికే ఎల్లో అలర్ట్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.
అంతేకాకుండా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ద్రోణి తీవ్రత గట్టిగా ఉండే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, వర్షాల ధాటికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడుతుందని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాలలో గడిచిన రెండు రోజులుగా కురిసిన వర్షాలతో వాతావరణం కూల్గా మారినట్లు గుర్తు చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాల ప్రతాపం గట్టిగానే ఉండనుందని అధికారులు వివరించారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తగినంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించారు.
సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో.. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. అయితే ఈ వానలు పంటలకు మేలు చేస్తాయన్న ఆనందంలో రైతన్నలు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.





