Just InternationalLatest News

Hong Kong:హాంగ్‌కాంగ్‌ విషాదం.. దట్టమైన మంటల్లో అపార్ట్‌మెంట్లు..పెరుగుతున్న మృతుల సంఖ్య!

Hong Kong: ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు కనీసం 44 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Hong Kong

హాంగ్‌కాంగ్‌(Hong Kong)లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఆ ప్రాంతంలో పెను విషాదాన్ని మిగిల్చింది. తైపో ప్రాంతంలోని వాంగ్ ఫక్ కోర్ట్ అనే అతిపెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో మొదలైన ఈ ఫైర్ ఇన్సిడెంట్, నగరాన్ని మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది హాంగ్‌కాంగ్ చరిత్రలోనే 17 ఏళ్లలో సంభవించిన అతిపెద్ద అగ్నిప్రమాదంగా (లెవల్ 5 ఫైర్) రికార్డ్ అయ్యింది.

అధికారులు గురువారం ఉదయం అందించిన వివరాల ప్రకారం, ఈ (Hong Kong)ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు కనీసం 44 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 279 మంది కనిపించకుండా పోయారు. రెస్క్యూ టీమ్‌లు ఇంకా గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక హాస్పిటల్స్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

ఈ వాంగ్ ఫక్ కోర్ట్ కాంప్లెక్స్‌లో మొత్తం 8 బ్లాకులు ఉన్నాయి, ఒక్కో బ్లాక్‌లో 31 అంతస్తుల నిర్మాణం ఉంది. దాదాపు 2,000 అపార్ట్‌మెంట్లలో 4,800 మంది నివసిస్తున్నారు.

ఈ (Hong Kong)అగ్ని ప్రమాద తీవ్రత ఇంత వేగంగా పెరగడానికి , ఇతర టవర్లకు కూడా వ్యాపించడానికి కొన్ని నిర్దిష్ట కారణాలను అధికారులు గుర్తించారు.

వెదురుతో నిర్మాణం (Bamboo Scaffolding).. ఈ అపార్ట్‌మెంట్‌ల బయటి గోడల నిర్మాణం కోసం వెదురు బొంగులను ఉపయోగించారు. వెదురు చాలా సులభంగా మండుతుంది కాబట్టి, మంటలు ఒక టవర్ నుంచి మరొక టవర్‌కు వేగంగా వ్యాపించాయి.

Hong Kong
Hong Kong

నిర్మాణ నెట్ తొలగింపు లేకపోవడం.. కన్‌స్ట్రక్షన్ సమయంలో వాడిన భద్రతా నెట్‌ను (Construction Net) తొలగించకుండా వదిలివేయడం వల్ల, మంటలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఈజీగా వ్యాప్తి చెందాయి.
బలమైన గాలులు.. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో భారీగా గాలులు వీయడం వల్ల, అగ్నికీలలు మరింత ఎత్తుకు ఎగిసిపడి, అదుపులోకి రావడం కష్టమైంది.

ఈ మూడు అంశాలు కలిసి పనిచేయడం వల్ల, ఒక చిన్న ప్రమాదం హాంగ్‌కాంగ్‌లో ఇంతటి భారీ విపత్తుగా మారిందని దర్యాప్తు బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి.

ఈ పెను ప్రమాదంపై హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ వెంటనే స్పందించారు. అత్యవసర బృందాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. దాదాపు 700 మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సెక్యూరిటీ ఫోర్సెస్ కలిసి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

అగ్నిమాపక విభాగం, పోలీసులు సంయుక్తంగా ఈ ప్రమాదానికి గల కారణాలను పరిశోధించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

అధికారుల రిపోర్ట్ ప్రకారం, దాదాపు 90 శాతం మంది నివాసితులను భవనం నుంచి సురక్షితంగా తరలించగలిగారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో మంటలు, దట్టమైన పొగ ఆకాశమంతా కమ్ముకోవడం, స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించాయి. అగ్నిమాపక శాఖ చుట్టుపక్కల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోనే ఉండి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని సూచించింది.

ఈ అగ్నిప్రమాదం హాంగ్‌కాంగ్‌లో 17 ఏళ్ల తర్వాత సంభవించిన తొలి లెవల్ 5 ఫైర్ అలర్ట్ కావడం, ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడం ఆ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలుస్తోంది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button